‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ బుక్ను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : సాక్షి, తాడేపల్లి: జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన దివంగత డాక్టర్ సి. నారాయణ రెడ్డి పార్లమెంట్ ప్రసంగాల సంకలనం 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. రాజ్యసభ పూర్వ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఒకే వాక్యంలో చెప్పాలంటే సినారె ప్రసంగాల పుస్తకం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం జగన్ అన్నారు.
సభాధ్యక్షులుగా పాల్గొన్న సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తనకు డాక్టర్ సి.నారాయణ రెడ్డితో 45 ఏళ్ల పరిచయమని, ఆయనతో ఇందిరా పార్కులో మార్నింగ్ వాకింగ్ చేసే రోజుల్లో ఆయన కవితల ప్రధమ శ్రోతను తానే అని అన్నారు. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ, రెండో వారు సినారె అని గుర్తు చేశారు. ముఖ్య అతిథి జాతీయ జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం మాట్లాడుతూ.. వైఎస్ జగన్కు ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారని, అందుకు తగ్గ సవాళ్లు కూడా ఉంటాయని అన్నారు. వాటిని అధిగమించే శక్తి సీఎం జగన్కు ఉందని భావిస్తున్నానన్నారు.
పార్లమెంట్లో అనేక అనుభవాలను, దృశ్యాలను సంఘటనలను చెప్పిన డాక్టర్ సినారె ప్రసంగాలను సంకలనం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ పుస్తకావిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి రైతు నేస్తం పబ్లికేషన్స్ అధిపతి యడవల్లి వేంకటేశ్వరరావు సంధానకర్తగా వ్యవహరించారు.