
చంద్రబాబు ప్రధానమంత్రి స్థాయి నేత
సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి స్థాయి నేత అని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు.
అటవీ మంత్రి బొజ్జల
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి స్థాయి నేత అని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లను ఏర్పాటుచేసి సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బుధవారం చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లులో ‘జన్మభూమి- మా ఊరు’ లో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రికి ఉండాల్సిన లక్షణాలన్నీ చంద్రబాబులో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు చంద్రబాబు తీసుకెళ్తుంటే ప్రతిపక్షం మాత్రం ఈ రోజున ధర్నాలు చేస్తోందన్నారు.
ఎన్నికల్లో రుణ మాఫీ చేయలేం, ఎలా రుణ మాఫీ చేస్తారు అంటూ ప్రశ్నించిన విపక్షం ఇప్పుడు తక్షణమే రుణ మాఫీ చేయాలి అంటూ ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు. 97 శాతం మంది రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని, విపక్షం తక్కిన మూడు శాతం రైతుల రుణ మాఫీ చేయాలని కోరుతోందని.. ఆదాయం పన్ను కట్టేవాళ్ల రుణాలను కూడా మాఫీ చేయాలంటే ఎలా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే భూప్రకంపనలు రేగాయన్నారు. గతంలో ఎర్రచందనాన్ని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తే.. ఇప్పుడు పట్టుకుంటున్నామని చెప్పారు. ఎర్రదొంగల అంతుచూస్తామని.. అణచివేస్తామని పునరుద్ఘాటించారు.