'దమ్ముంటే చంద్రబాబు ప్రజలకు వివరించాలి' | Chandra babu should say why is going to delhi, dares Sharmila | Sakshi
Sakshi News home page

'దమ్ముంటే చంద్రబాబు ప్రజలకు వివరించాలి'

Sep 13 2013 2:24 PM | Updated on Jul 28 2018 6:33 PM

'దమ్ముంటే చంద్రబాబు ప్రజలకు వివరించాలి' - Sakshi

'దమ్ముంటే చంద్రబాబు ప్రజలకు వివరించాలి'

రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నాడని షర్మిల అన్నారు.

రావులపాలెం : రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నాడని షర్మిల అన్నారు. పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకోవటం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ప్రసంగించారు.  రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు.

లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించిన ఘటన వైఎస్దన్నారు. విభజన పేరుతో అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెస్ చలికాచుకుంటోందని షర్మిల మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో కోట్లాది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు.


రాష్ట్రానికి 50 శాతానికి పైగా ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని, ఎలాంటి పరిష్కారాలు చూపకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్లు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని షర్మిల అన్నారు. 60 శాతం ప్రజలకు అన్యాయం జరిగినా కాంగ్రెస్‌ను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

తెలంగాణ అనుకూల లేఖ వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు ఢిల్లీకెళ్లి ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. చీకట్లో చిదంబరంను కలిసి కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని అన్నారు. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో దమ్ముంటే చంద్రబాబు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.


'వైఎస్‌ఆర్ చంద్రబాబును చూసి భయపడేవారంట..చంద్రబాబును చూసి భయపడటానికి ఏమైనా అంటు వ్యాధులున్నాయా' అని షర్మిల ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకంటే కాంగ్రెస్, టీడీపీ నేతలకు పదవులే ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్‌ఆర్ సీపీ తన వంతుగా పోరాడుతోందని, జగనన్న, విజయమ్మ సహా వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేశారని షర్మిల తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement