విజృంభిస్తున్న విష జ్వరాలు | Booming toxic fevers | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న విష జ్వరాలు

Sep 4 2014 2:09 AM | Updated on Sep 2 2017 12:49 PM

విజృంభిస్తున్న  విష జ్వరాలు

విజృంభిస్తున్న విష జ్వరాలు

జిల్లాలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ జబ్బున పడుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

కర్నూలు (హాస్పిటల్)/ బనగానపల్లె టౌన్: జిల్లాలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ జబ్బున పడుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వర బాధితులు ఎక్కువవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 320 డెంగీ కేసులు నమోదయ్యాయి. మొన్న మంత్రాలయం మండలంలో డెంగీ లక్షణాలతో ఇద్దరు చిన్నారులు, నిన్న సి. బెళగల్ మండలంలో తొమ్మిది నెలల పాప, బుధవారం బనగానపల్లె మండలంలో ఐదేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డారు.
 
 అభం, శుభం తెలియని పిల్లలు అకాల మరణం చెందుతున్నా జిల్లా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయని బాధితులు వాపోతున్నారు. బనగానపల్లె మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రెండు వారాలుగా విష జ్వరాలు అదుపులోకి రావడం లేదు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండాపోయింది. డెంగీ వ్యాధి లక్షణాలతో షఫియా ఉరఫ్ చాంద్‌బీ (5) బుధవారం మృతి చెందింది.
 
 గామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన గౌండ కార్మికుడు మహమ్మద్‌గౌస్, మెహ్రున్‌బీ దంపతులకు కొడుకు హుస్సేన్‌బాష, కూతురు చాంద్‌బీ సంతానం. చిన్నారికి నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో బనగానపల్లెలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో వైద్యుల సూచన మేరకు ఈ నెల 2న కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చాంద్‌బీకి రక్త పరీక్షలు నిర్వహించి, ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మందులు రాసి ఇంటికి పంపించారు. అదే రోజు గ్రామానికి వచ్చిన తరువాత రాత్రి జ్వరం ఎక్కువ కావడంతో వెంటనే నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. అక్కడి వైద్యులు చిన్నారికి రక్త పరీక్షలు నిర్వహించి, రక్త కణాల శాతం తక్కువగా ఉందని, వెంటనే కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. కర్నూలు రెయిన్‌బో హ స్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ చేర్చుకోకపోవడంతో నగరంలోని జీవీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం ఉదయం చాంద్‌బీ మృతి చెందింది. డెంగీ లక్షణాలతోనే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్యసేవలందించి ఉంటే తమ బిడ్డ బతికేదని మృతురాలి బంధువులు వాపోయారు. ఇటీవలే కృష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల గ్రామానికి చెందిన బోయ సూరి(6) అనే బాలుడు జ్వరం వచ్చి మృతి చెందాడు. జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మలేరియా కూడా విజృంభిస్తోంది.
 
 భయం..భయం..
 ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రెండు వారాలుగా జ్వరాలు అదుపుకాకపోవడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. గత నెల 16వ తేదీ నుంచి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినా జ్వరాలు తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దాదాపు 70 మంది వరకు విష జ్వరాల బారిన పడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 30న డీఎంహెచ్‌ఓ నరసింహులు గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. గ్రామంలో సాధారణ జ్వరాలే ప్రబలుతున్నాయని, గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవరసరం లేదని చెప్పారు. అయితే రోజు రోజుకు బాధితుల సంఖ్య అధికం కావడం, డెంగీ వ్యాధి లక్షణాలతో ఓ చిన్నారి మృతి చెందడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి విష జ్వరాలను అదుపులోకి తేవాలని, గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరుచాలని స్థానికులు కోరుతున్నారు.
 
 పారిశుద్ధ్యలోపమే ప్రధాన సమస్య..
  పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటమే విషజ్వరాలు ప్రబలేందుకు కారణమవుతోంది. కృష్ణగిరి మండలం బోయ బొంతిరాళ్ల గ్రామంలో 250 గృహాలు ఉన్నాయి. గ్రామంలో 1200 మంది నివశిస్తున్నారు. మురుగు కాల్వ వ్యవస్థ లేదు. దీంతో ఇళ్ల ముందే మురుగు నీరు నిలిచి అస్తవ్యస్తంగా ఉంది. ఒక బాలుడు మృతి చెందిన తర్వాత పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పారిశుధ్యం పనులు చేపడుతున్నారు. అలాగే ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ గ్రామంలో 3,800 మంది నివాసం ఉంటున్నారు. రోడ్డు పక్కన పాడు పడిన బావి దోమలకు అవాసంగా మారింది. అనేక చోట్ల నీళ్లు నిలిచి దోమల స్వైర విహారం చేస్తున్నాయి. ఐ.కొత్తపేట, అల్లినగరం, నేమకల్లు, కందనకుర్తి, అలువాలు ఇలా అనేక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. తీవ్రమైన జ్వరాలతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
 
 డెంగీ మూడో దశ ప్రమాదకరం
 - అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజా సుబ్బారావు :
 జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. మలేరియా విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. డెంగీ(వైరల్ ఫీవర్) విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మొదటి, రెండు దశల్లో వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది. మూడో దశలో రోగి సొమ్మసిల్లిపోతాడు. ఇది ప్రమాదకరమైన దశ. అయితే డెంగీని నిర్ధారించే పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు.
 
 పెద్దాసుపత్రిలో అన్ని అసౌకర్యాలు ఉన్నాయి  
 - డాక్టర్ ఉమామహేశ్వర్, సూపరింటెండెంట్, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి
 పెద్దాసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కర్నూలు వైద్యశాల ఆధ్వర్యంలో మైక్రోబయాలజీ(ప్రయోగశాల) విభాగం ఉంది. డెంగీ బాధితుని రక్తనమూనా తీసుకుని ఇక్కడ పరీక్ష చేస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ అవకాశం లేదు. వివిధ రకాల జ్వరాలతో బాధ పడుతున్న రోగులకు వైద్యపరీక్షలు, సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో మెడికల్ ఓపీలో జ్వరం బారిన పడినవారు వస్తున్నారు. ఇక్కడ మందుల సమస్య లేదు.
 
 ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
 అనాఫిలస్‌కులిసిఫెసిస్ అన్న దోమ వల్ల మలేరియా జ్వరం వస్తుంది. రాత్రి వేళల్లో ఇది కుడుతుంది. ఎడిస్ ఇజప్టస్ అన్న దోమ వల్ల డెంగీ జ్వరం వస్తుంది. పగలు మాత్రమే ఇది కుడుతుంది.
 
 పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.మురికినీటి గుంతలు లేకుండా చూసుకోవాలి.
 ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలి.ఉదయం పూట నిద్రించే గర్భవతులు, బాలింతలు, రోగులు, పిల్లలు, వృద్ధులు మస్కిటో కాయిల్స్ తప్పనిసరిగా వాడాలి.పిల్లలు.. శరీరం అంతా కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement