వెంకయ్య ఇంటి ముందు ఆందోళన చేయాలి :ఆకుమర్తి

AP SC Leader Aakumarti Fires On Manda Krishna Madiga - Sakshi

సాక్షి, విజయవాడ: తన స్వార్థ ప్రయోజనాల కోసం మంద కృష్ణ, మాదిగలను బలిపశువులను చేయాలని చూస్తున్నారంటూ ఏపీ మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షులు ఆకుమర్తి చినమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ముసుగులో మందకృష్ణ మాదిగ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. అమాయక మాదిగ యువకుల్ని ప్రభుత్వంపై ఉసిగొల్పి కేసుల పాలు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా వర్గీకరణపై ఒక్కమాట మాట్లాడని డొక్కా, వర్ల రామయ్యల డైరెక్షన్‌లో మందకృష్ణ పనిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్గీకరణపై మాట్లాడేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా ఎందుకు వెళ్లలేదో మందకృష్ణ చెప్పాలని ఆకుమర్తి డిమాండ్‌ చేశారు. మాదిగల అభివృధ్ధికోసం సీఎం జగన్ ఆలోచిస్తున్న సమయంలో.. మాదిగలను మందకృష్ణ తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్‌లకు మద్దతిచ్చి, ఏపీలో మాత్రం టీడీపీకి మేలు కలిగే విధంగా మందకృష్ణ వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అర్హత మందకృష్ణకు లేదన్నారు. నిజాయతీ ఉంటే ఎస్సీ వర్గీకరణపై కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్‌ చేశారు. మందకృష్ణకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ చేస్తామన్న వెంకయ్యనాయుడు ఇంటిముందు ఆందోళన చేయాలని స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top