
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మార్చి 15న వైఎస్ వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సిట్ పలు కోణాల్లో దర్యాప్తు చేసింది. కాగా తన తండ్రి హత్యపై పలు అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టు ఈ సందర్భంగా సీబీఐకి సూచించింది.