నేటి నుంచి అసెంబ్లీ
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
ఇవే చివరి సమావేశాలు
స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడి
సాక్షి, అమరావతి : రాష్ట్ర 14వ శాసనసభ 13వ సెషన్ సమావేశాలు బుధవారం మొదలవుతాయని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అసెంబ్లీ భవనంలోని తన ఛాంబర్లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల కాలానికి ఇవే చివరి సమావేశాలని, బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారన్నారు. 31వ తేదీ ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని, సభ్యులు కిడారి సర్వేశ్వరరావు మృతికి సంతాప తీర్మానం తర్వాత వాయిదా పడుతుందని వివరించారు. సభకు 1, 2, 3, 4 తేదీలు సెలవులన్నారు. మళ్లీ 5 నుంచి 8 వరకు నాలుగు రోజులు సభ జరుగుతుందన్నారు. 5వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఆ తర్వాతి రోజుల్లో ప్రభుత్వ బిల్లులు, ప్రశ్నోత్తరాలు,జీరో అవర్ నిర్వహిస్తామన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం రాజ్యాంగంలోని 16వ ఆర్టికల్ నిబంధనలకు విరుద్దమని తెలిపారు.
సభలో ఇరుపక్షాలు ఉంటేనే సంతృప్తి
ఈ సారి కూడా ప్రతిపక్ష నేత జగన్ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తానని సభాపతి తెలిపారు. ఫోన్ ద్వారా ఆయన్ను ఆహ్వానించేందుకు ప్రయత్నించానని, అయితే ఆయనతో మాట్లాడేందుకు అవకాశం రాలేదని చెప్పారు. ప్రతిపక్షం లేదనే అసంతృప్తి తనకు ఉంటుందన్నారు.