కామాంధుడి చేతిలో బాలిక బలి | Another child raped in Tirlapur | Sakshi
Sakshi News home page

కామాంధుడి చేతిలో బాలిక బలి

Oct 29 2013 3:38 AM | Updated on Jul 23 2018 9:13 PM

చట్టాలు చట్టుబండలవుతున్నాయి. కామాంధుడి దాష్టీకానికి మరో బాలిక బలైంది. గార్ల మండలం తిర్లాపురంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

 గార్ల, న్యూస్‌లైన్: చట్టాలు చట్టుబండలవుతున్నాయి. కామాంధుడి దాష్టీకానికి మరో బాలిక బలైంది. గార్ల మండలం తిర్లాపురంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్యా వీరన్న కూతురు కిరణ్మయి(14) ఖమ్మంలోని ఎస్టీ బాలికల వసతిగృహంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ఈనెల 18న తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా.. ఆ బాలిక ఒంటరిగా ఇంటివద్ద ఉంది. ఇది గమనించి అదే గ్రామానికి చెందిన లావుడ్యా బాబూరావు లైంగికదాడికి యత్నించాడు. కిరణ్మయి ఎదురుతిరగడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రం గా గాయపడిన బాలికను బంధువులు ఖమ్మం తరలించగా చికిత్సపొందుతూ ఆది వారం అర్ధరాత్రి మృతి చెందింది. నిందితుడిపై ‘నిర్భయ’, హత్యానేరం కేసులు నమోదు చేశారు.
 
 సెలవులకు రాకున్నా బాగుండేదే...
  ‘మాయదారి పండుగ మా ఇంటి ఆడబిడ్డను కానరాకుండా చేసింది. సెలవులు రాకుంటే మా బిడ్డ ఖమ్మంలోనే ఉండేది..’ అంటూ కిరణ్మయి తల్లి శారద విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. తన కూతురుకు అప్పుడే నూరేళ్లు నిండాయంటూ తండ్రి వీరన్న భోరున విలపించాడు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రుల రోదనల మధ్య సాయంత్రం బాలిక మృతదేహాన్ని ఖననం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా  ఏఎస్సై యాకూబ్‌పాషా ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  
 
 నిందితుడిని కాల్చిచంపాలి...
 మహిళా సంఘాల డిమాండ్
 ఖమ్మం మయూరిసెంటర్ : అభం శుభం తెలియని బాలికపై లైంగికదాడికి యత్నించి.. ఎదురుతిరిగిందనే కోపంతో కిరోసిన్ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారణమైన నిందితుడిని కాల్చి చంపాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.  ఖమ్మం ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోటు కళావతి, జిల్లా అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి లక్ష్మి, సీతామహాలక్ష్మి, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు కొల్లు పద్మ, కె. కనకదుర్గ, ఎం.నాగమణి, బి. పద్మ సందర్శించి నివాళుల ర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిం దితుడైన బాబూరావును అరెస్టు చేసి వదిలేయకుండా తక్షణమే కాల్చి చంపాలన్నారు. నిందితుడి తరుపున న్యాయవాదులు ఎవరూ వాదించవద్దని కోరారు. నిర్భయ చట్టం వచ్చినా మహిళలపై దా డులు, అత్యాచారాలు తగ్గడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతు న్న మృగాళ్లను అక్కడికక్కడే శిక్షించాలన్నారు. నిం దితుడిని  శిక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు.
 
 మహిళలకు రక్షణ లేదు
 మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. వరస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడంతో దోషులకు శిక్ష పడడం లేదు.  
 -పోటు కళావతి, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
 
 ఎక్కడిక్కడ శిక్షలు వేస్తేనే నేరాలు తగ్గుతాయి:  సంఘటన జరిగిన చోట వెంటనే శిక్ష అమలు చేస్తే ఇలాంటివి మళ్లీ జరగవు. ఎవరినీ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. నిందితులను కఠినంగా శిక్షిస్తే.. అది చూసి మరొకరు ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా ఉంటారు. చట్టాలంటే భయం లేకపోవడం వల్లే ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు.
 
 -కనకదుర్గ, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి  
 నిర్భయ చట్టం ఎక్కడాఅమలు కావడం లేదు
 మహిళలపై రోజురోజుకూ అత్యాచారలు పెరిగిపోతున్నా ఎక్కడా నిర్భయ చట్టం  అమలు కావడం లేదు. దీంతో నేరం చేసేవారికి భయం లేకుండా పోతోంది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కూడా ఎక్కడా పనిచేయడం లేదు. చట్టాలపై అవగాహన కల్పిండంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.
 -స్వరూపారాణి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement