విజయవాడలో తమ దేశ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అమెరికా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చింది.
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో తమ దేశ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అమెరికా ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చింది. విజయవాడ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం చేసిన విజ్ఞప్తిపై ఆ దేశ ప్రతినిధి బృందం స్పందించినట్లు ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా రాజకీయ, సైనిక వ్యవహారాల సహాయ మంత్రి పునీత్ తల్వార్, ఉప, సహాయ మంత్రులు అతుల్ కాశ్యప్, కెన్నెత్ హ్యాండిల్కన్, కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ తదితరులు మంగళవారం సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. నూతన రాష్ట్ర తీరు, తెన్నులను అడిగి తెలుసుకున్నారు. నూతన రాజధాని నగర నిర్మాణాన్ని రెండు,మూడు నెలల్లో చేపడతామని అమెరికా బృందానికి చంద్రబాబు తెలిపారు. రక్షణ, సాంకేతిక రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న అమెరికా ప్రతిపాదనను స్వాగతించిన సీఎం.. తూర్పు నావికాదళానికి విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తోందని వివరించినట్లు ప్రకటన పేర్కొంది.
నేడు రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాలు
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ప్రతినిధి బృందం బుధ, గురువారాల్లో హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పర్యటించనుంది. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అపర్ణా భాటియా నేతృత్వంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు కంట్రీ డెరైక్టర్ ఎం.తెరెసా ఖో, ప్రపంచ బ్యాంకు కంట్రీ డెరైక్టర్ ఓన్నో రుహి తదితరులు ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈ బృందం బుధవారం హైదరాబాద్ చేరుకుని గురువారం విశాఖపట్నం వెళుతుంది.