ఊపందుకున్న రాములోరి బ్రహ్మోత్సవాల సన్నాహాలు | all arrangements are done for brahmotsavam at vontimitta | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న రాములోరి బ్రహ్మోత్సవాల సన్నాహాలు

Mar 21 2017 5:45 PM | Updated on Sep 5 2017 6:42 AM

ఊపందుకున్న రాములోరి బ్రహ్మోత్సవాల సన్నాహాలు

ఊపందుకున్న రాములోరి బ్రహ్మోత్సవాల సన్నాహాలు

రెండవ అయోధ్యగా ప్రసిద్ధిచెందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహోత్సవాల సన్నాహాలు ఊపందుకున్నాయి.

► ఆలయం సమీపంలో గార్డెనింగ్‌
► కళ్యాణవేదిక వద్ద ఏర్పాట్లు ముమ్మరం
 
ఒంటిమిట్ట రామాలయం(రాజంపేట): రెండవ అయోధ్యగా ప్రసిద్ధిచెందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహోత్సవాల సన్నాహాలు ఊపందుకున్నాయి. పనులను వేగవంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధిచి తాత్కాలిక పనులే అధికంగా ఉండటం వల్ల పనులు పకడ్బందీగా సకాలంలో పూర్తి చేయాలని ఈఓ సాంబశివరావు ఆదేశించారు. ఉత్సవాలకు ఆలయంతోపాటు కళ్యాణవేదికను ముస్తాబు చేస్తున్నారు.
 
ఆలయం సమీపంలో గార్డెనింగ్‌: రామాలయం సమీపంలో గార్డెనింగ్‌ పనులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో కడియం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలమొక్కలను  11రకాల తెప్పించారు. 8,452 మొక్కల నాటి, గార్డెన్‌ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ రూ.లక్షలను వ్యయం చేస్తోంది. ఒకొక్కరకం పూలమొక్కలను 500 నుంచి 2500 లోపు తీసుకొచ్చి నాటించే పనిలో పడ్డారు. 
 
కళ్యావేదిక సమీపంలో రూ.52లక్షలతో మొక్కలు నాటింపు: కడప రేణిగుంట రహదారిలో తిరుమల తిరుపతి దేవస్ధానం రూ.52లక్షలతో మొక్కలు నాటింపు కార్యక్రమం పూర్తికావచ్చింది. ఈ మొక్కలను మూడు సంవత్సరాల పాటు రక్షించేలా టీటీడీ ప్రణాళికలను రూపొందించుకుంది. ఈ మొక్కలను కళ్యాణవేదిక ప్రాంతంలో కూడా నాటించారు. దీంతో భవిష్యత్తులో కళ్యాణవేదిక పచ్చదనం పరుచుకోనుంది.
 
ఆలయంలో తాత్కలిక షెల్డర్లు..: రామాలయంలోఖాళీగా ఉన్న ప్రాంతంలో తాత్కలిక షెల్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ షెల్డరు వల్ల భక్తులకు నీడ సౌకర్యంతో పాటు ఆలయ నిర్వహణకు సౌకర్యంగా ఉంటుందని భావించి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకునేలా  ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూ.34లక్షలతో ముఖద్వారం,  ప్రహారీగోడను నిర్మిస్తున్నారు. అలాగే అలంకారమండపం పనులను చేపట్టారు.
 
రథానికి మరమ్మత్తులు..: స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రధోత్సవం నాడు సీతారామలక్ష్మణ స్వామివార్లను ఊరేగించేందుకు రథంను టీటీడీ సిద్ధం చేస్తోంది. గతంలో రథోత్సవం నాడు తలెత్తిన లోపాలను సరిద్దుకునేందుకు ఈసారి రథాన్ని సిద్ధం చేస్తున్నారు. రథోత్సవంను మాఢవీధుల్లో తిరిగేందుకు వీలుగా చర్యలను తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement