breaking news
-
చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్ఎంసీ (NMC) గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (FMG) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్షిప్ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు.‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా?..తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్లో భాగం కాదా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..@ncbn గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ (NMC) గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్(FMG) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్షిప్… pic.twitter.com/GKBsMr7e9J— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2025‘‘పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
మీ అడుగులకు మడుగులొత్తలేం.. సైడైపోతున్న జనసేన, బీజేపీ
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి వచ్చాక ఎవరి చేతికి ఎక్కువ పవర్ దక్కిందన్న విషయంలో పార్టనర్ల మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతున్నప్పటికీ అంతా గుంభనగా ఉన్నట్లుగా మ్యానేజ్ చేస్తూ వస్తున్నారు.అన్నిటికి మించి పొత్తులకు ముందు ఓడ మల్లయ్య అని పిలిచే చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక బోడి మల్లయ్య అంటారన్న విషయం జనసేన, బీజేపీలకు మరో మరో అర్థమయింది. దీంతో ఇప్పుడు వాళ్లు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఓడలో నుంచి బయటకు రాలేక.. అందులోనే ప్రయాణం చేయలేక సతమతమవుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కాంట్రాక్టర్లు ఇతరత్రా వ్యవహారాల్లో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన, బీజేపీ నాయకులను కేవలం పెయిడ్ కూలీలుగా మాత్రమే భావిస్తూ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.నీకు ఇవ్వాల్సిన కూలి డబ్బులు ఇచ్చేసాంగా ఎవరి కోసం మా జెండా మోస్తారు అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు తీరు ఉంది. ఇదే తరుణంలో ప్రభుత్వంలో చంద్రబాబుకు బదులుగా లోకేష్ పెత్తనం పెరిగిపోవడం బీజేపీ, జనసేన నాయకులను తొక్కేస్తూ కేవలం టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తూ వెళ్లడం కూడా భాగస్వామి పక్షాలైన ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.లోపల సరుకు పుచ్చిపోయినా.. బయట మంచి కలరింగ్.. కవరింగ్ ఇచ్చేసి జనానికి అంటగట్టే వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సైతం ఇటు తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువెత్తుతున్న దాన్ని మీడియా ఇతర పబ్లిసిటీ సంస్థలు మాటున దాచిపెట్టి అంతా బాగుంది అన్నట్లుగా ప్రజలను భ్రమింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు అంటూ ఇంటింటికి తన ప్రభుత్వ విజయాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో భాగంగా భాగస్వామి పక్షాలైన జనసేన, బీజేపీతో బాటు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన పథకాలు సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తారు. అయితే చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్నట్లుగా సర్వేల్లో వెళ్లడవడం.. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, తెలుగుదేశం నాయకుల అలవిమాలిన అవినీతి.. దందాలు.. గూండాగిరి వంటి అంశాల ద్వారా ప్రజల్లో ఘోరమైన అప్రదిష్టను ఏడాదిలోనే మూటగట్టుకుంది.దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు ఈ క్షణమే ఓడిపోతారని.. ఇంకా ఎంతోమంది ఓటమి అంచులో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బాటు గెలిచిన తరువాత టీడీపీ నాయకుల్లో అహంకారం పెరగడం.. జనసేన, బీజేపీ నేతలను చిన్నచూపు చూస్తుండడం వంటి అంశాలు కూడా గ్రామ స్థాయిలో కూడా చర్చలకు కారణమవుతున్నట్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు ప్రచార కార్యక్రమానికి జనసేన, బీజేపీ నాయకులు దూరంగా ఉంటున్నారు."మీ అవకాశవాదానికి ఒక దండం.. మీ అడుగులకు మేం మడుగులొత్తలేం" అంటూ చిన్నగా సైడ్ అయిపోతున్నారు. మంచి ప్రభుత్వం పేరిట చేపట్టని ఈ ప్రచారానికి కేవలం తెలుగుదేశం నాయకులు మాత్రమే హాజరవుతున్నారు. అక్కడక్కడ అరా ఒకటి తప్ప జనసేన-బీజేపీ నాయకుల హాజరు లేనేలేదు. కూటమి గెలవడానికి మా అవసరం ఉంది.. ఆ పొత్తు లేకపోతే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యేనా అంటూ ఇటు జనసేన-బీజేపీ నాయకులు లోలోన భావిస్తున్నారు. అలాంటపుడు తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే కానీ అధికారం దక్కాక బాబు.. టీడీపీ నేతల తీరు మారిందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడా వీళ్లు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఊసురో మంటూ కేవలం టీడీపీ నేతలు ఈ ప్రచారాన్ని చేపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
యువ వైద్యులకు అండగా ఉంటాం: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్యవిద్యను పూర్తి చేసుకుని, సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులను పై పోలీసులను ప్రయోగించి, అరెస్ట్లు చేయడం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని మండిపడ్డారు. యువ వైద్యులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వ మెడలు వంచైనా సరే వారికి పీఆర్ వచ్చే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో వేధింపులకు ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా అన్ని వర్గాలను వేధించి పరాభవిస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. వారంతా ప్రభుత్వంపై శాంతి యుతంగా నిరసనకు దిగితే ఈడ్చి పారేశారు. ఉన్నత చదువులు చదివి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని 'డాక్టర్స్ డే' అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం అవమానించింది.పేద కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యనభ్యసించడంతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకండా వేధించడానికి ప్రభుత్వానికి మనసెలా ఒప్పిందో అర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏడాదే ఉంటే ఏపీలో మాత్రం మూడేళ్లపాటు చేయాలనే నిబంధన పెట్టి వేధిస్తున్నారు. ఇంటర్న్షిప్ చేసిన వారిని రిలీవ్ చేయడం లేదు. పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టడమో, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడమో లేదా పీజీలు రాసుకుంటున్నారు.కానీ ఒక్క ఏపీలో మాత్రమే ఇంటర్న్షిప్ చేసిన దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను తెలియపర్చడానికి హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిస్తే ఆయన వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. దీంతో మెడికల్ విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి పూనుకుంటే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువ వైద్యులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ని కలిశారు. వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుని వారికి న్యాయం చేసేదాకా పోరాడుతుంది.వైద్య రంగంపై చంద్రబాబు నిర్లక్ష్యంరాష్ట్రంలో మొత్తం వైద్య రంగాన్నే చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడు. సీఎంగా వైఎస్ జగన్ తీసుకువచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం, సీట్లు అక్కరలేదని కేంద్రానికి లేఖ రాయడం, నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేయించడం వంటి చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధుల వైద్య విద్య ఆశలపై నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంబీబీయస్ డాక్టర్లు, పీజీ డాక్టర్లను నియమించుకోకుండా ఎలా వైద్యం అందించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో వైద్యారోగ్యశాఖలో ఐదేళ్లలో 54 వేలమంది నియామకం జరిగితే అందులో డాక్టర్లే 3800 మంది ఉన్నారు.మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ లేరంటూ వైద్యం నిరాకరిస్తున్నారు. వైద్య విద్య పూర్తిచేసుకుని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు చేయకుండా వేధిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఆయుష్మాన్ భారత్లో కలిపే పేరుతో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి లేకుండా ఆపరేషన్లు జరిగితే ఇప్పుడు కూటమి పాలనలో యూజర్ చార్జీల పేరిట రోగులను దోచుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో కోపేమెంట్ల పేరుతో వసూలు చేసి ఆస్పత్రులను నడిపించుకోవాల్సిన పరిస్థితి ఆస్పత్రి యాజమాన్యాలది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. -
యువ వైద్యులపై కూటమి సర్కార్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్రలు మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు 1500 మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత 13 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా, వారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగితే, పోలీసులతో వారిని అరెస్ట్ చేయించి, టెంపో వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించడం ద్వారా ప్రభుత్వం తన కర్కశత్వాన్ని చాటుకుందని ధ్వజమెత్తారు. ఇంకా వారేమన్నారంటే..విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని ఎన్ఎంసీ పరీక్ష క్వాలిఫై అయిన వారికి నిబంధనల ప్రకారం ఏడాది పాటు ఇంటర్న్షిప్ నిర్వహిస్తారు. అనంతరం వారికి రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 13 నెలల నుంచి విద్యార్ధులు పీఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా, వారి గోడు వినేవారే లేరు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రిని కలిసిన యువ వైద్యులపై ఆయన కనీసం సానుభూతి కూడా చూపకుండా, బెదిరింపు ధోరణితో మాట్లాడారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ను కలిసి మొరపెట్టుకుంటే, వీరికి సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం పెట్టారు. కానీ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఈ ఫైల్పై కొర్రీలు వేస్తున్నారు. ఎన్ఎంసీ నుంచి క్లారిటీ ఉంటేనే పీఆర్ ఇస్తానంటూ, రెండేళ్ళ పాటు ఇంటర్న్షిప్ చేస్తేనే పీఆర్ ఇస్తామంటూ రకరకాలుగా సాకులు చూపుతూ అభ్యర్ధులను వేధిస్తున్నారు. వీరితో పాటు క్వాలిఫై అయిన వారందరూ వివిధ రాష్ట్రాల ఆయా ప్రభుత్వాల నుంచి పీఆర్ సర్టిఫికేట్లు పొందారు.కానీ ఏపీలో మాత్రమే యువ వైద్యుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. దీనిపై హెల్ట్ యూనివర్సిటీ ఎదుట యువ వైద్యులు ఆందోళన చేస్తే, రాత్రి సమయంలో టెంపో వ్యాన్లలో వారిని బలవంతంగా ఎక్కించి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. డాక్టర్స్ డే రోజునే వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది.రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్లు కేటాయిస్తామని కేంద్రం ముందుకు వస్తే, సీఎం చంద్రబాబు దానికి మోకాలడ్డారు. తమకు సీట్లు అక్కరలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరో వైపు ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.విదేశాల్లో చదువుకుని, ప్రాక్టీస్కు అన్ని అర్హతలు సాధించుకున్న యువ వైద్యుల పట్ల కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. తక్షణం యువ వైద్యులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం తరుఫున ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. -
వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది: పేర్ని నాని
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వంశీని జైల్లో ఉంచి కొందరు శునకానందం పొందారని, ఇందుకు రేపో.. మాపో.. మరో నాలుగేళ్లకో వాళ్లే అందుకు పశ్చాత్తాపం చెందుతారని అన్నారాయన. సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఇవాళ(జులై 2, బుధవారం) విడుదలయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. ఒకే కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు పెడుతూ కుట్రలు చేశారు. ఐదేళ్లు, పదేళ్లు కింద జరిగినవాటికి కూడా కేసు పెట్టారు. లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఎత్తుగడలు వేశారు. అడ్డగోలు జీతాలు తీసుకుని వాదించేవాళ్లు ఉన్నా కూడా.. వాదించడానికి ఢిల్లీ బాబాయి రావాలి అంటూ వాయిదాలు వేయించుకున్నారు. చివరకు ఇవాళ కూడా సుప్రీం కోర్టులో వంశీ బెయిల్ను రద్దు చేయించే ప్రయత్నం చేశారు. ఇంత చేసి సాధించింది ఏంటి?.. అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడమా? పోనీ..వంశీని రాజకీయాల నుంచి పారిపోయేలా చేశారా?.. గన్నవరం ప్రజల నుంచి దూరం చేయగలిగారా?. పైగా ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే ప్రజల్లో సానుభూతిని మూటగట్టి పెట్టారు. వంశీని జైల్లో ఉంచి మీ పార్టీకి(టీడీపీని ఉద్దేశించి..) మీరే గొయ్యి తవ్వుకున్నారు. కక్ష సాధింపు తప్ప కూటమి సాధించింది ఏమీ లేదు. కేవలం శునకానందం పొందారు. రేపో,, మాపో, మరో నాలుగేళ్లకైనా దీని వెనుక ఉన్నవాళ్లు ఈ విషయం తెలుసుకుంటారు అని పేర్ని నాని అన్నారు. -
సింగయ్య, జయవర్దన్ కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన.. పార్టీ తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు జగన్ను కలిశారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ సింగయ్య కుటుంబాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. అదే సమయంలో.. ఈ పర్యటనలో సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్దన్రెడ్డి గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరఫున రూ.10 లక్షల సాయం అందజేశారు. ఇవాళ జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు జగన్ను కలిశారు. జయవర్ధన్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైఎస్సార్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చారు. -
‘బాబు అనుకూల మీడియానే జగన్ బలం చూసింది.. ఒప్పుకుంది’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జెండా మోసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఇదే సమయంలో చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. పెన్షన్లు పెంచామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దీనిపై ప్రజలే సమాధానం చెబుతారు అని కామెంట్స్ చేశారు.ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నియోజక వర్గాల ఇంఛార్జిలు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘ప్రజలను మరోమారు మభ్యపెట్టేందుకు చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ చేపడుతోంది.వైఎస్ జగన్ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన. పెన్షన్లు పెంచామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నాడు. ఎంతమంది పెన్షన్లు అందక ఇబ్బంది పడుతున్నారో మారుమూల గ్రామాలకు వెళితే తెలుస్తుంది. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈ ఏడాది కాలంలో ఏం చేయగలిగేవారో ప్రజలకు మనం తెలియజేయాలి. వైఎస్ జగన్ చెప్పినట్లు మన కార్యకర్తలకు సెల్ ఫోనే ఆయుధం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం. జెండా మోసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగారు. బాండ్లు చూపించి మరీ ఎంతెంత వస్తాయో చెప్పారు. చంద్రబాబు రీకాల్ కార్యక్రమంలో బాబు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించడం మన బాధ్యత. నియోజకవర్గం, మండల స్థాయిలో చంద్రబాబు రీకాల్ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా విజయవంతం చేయాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలు ఈ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరు. ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..‘పోరాటాలు మనకు, మన పార్టీకి కొత్త కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి పోరాటం చేసిన పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్ జగన్ నేతృత్వంలో మరోసారి మనం పోరాటాలకు సిద్ధమవ్వాలి. ఆచరణ కాని అబద్ధాల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. వైఎస్ జగన్ను చూసి చంద్రబాబు మారాడని ప్రజలు భ్రమపడి ఓటేశారు. వైఎస్సార్సీపీ పోరాటం వల్లే ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది. వైఎస్ జగన్ సత్తెనపల్లి కార్యక్రమానికి ఎవరూ కార్లు పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ, వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్ జగన్ వెంట తరలివచ్చారు. చంద్రబాబు అనుకూల మీడియానే వైఎస్ జగన్ బలం గురించి నిజం ఒప్పుకుంటోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలి.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్కు, వైఎస్సార్సీపీకి అనుసంధానం కార్యకర్తలే. సచివాలయాలను నమ్ముకుని మనం మునిగిపోయాం. రెండు అబద్ధాలు చెప్పి అయినా సరే మనం అధికారంలోకి వద్దామని వైఎస్ జగన్ను కోరాం. కానీ, అబద్ధాలు వద్దని వైఎస్ జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేని వ్యక్తి చంద్రబాబు. ఈ ఐదేళ్లూ పనిచేసిన మన కార్యకర్తలను మర్చిపోకుండా పేర్లు రాసుకుందాం. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తాం. చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీని మనం జనంలోకి తీసుకెళ్లాలి. జంప్ జిలానీలంతా టీడీపీలోకి పోయారు. మన దగ్గర దమ్ బిర్యానీ వంటి నాయకులు, కార్యకర్తలు మిగిలారు’ అని చెప్పుకొచ్చారు. -
లోకేష్ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య
వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో ప్రమాదవశాత్తూ చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన భార్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మృతికి తనకు అనుమానాలు ఉన్నాయన్న ఆమె.. ఈ కేసులో తమ కుటుంబంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటోందని వాపోయారు. సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మరణించిన వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని.. ఆంబులెన్స్లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారామె. ‘‘నా భర్త మృతిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చిన్నచిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు?. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్సులో ఏదో జరిగి ఉంటుంది. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది’’ అని అన్నారామె.అలాగే.. పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారామె. ‘‘లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాల మీద ఏదో రాసుకు వచ్చి సంతకాలు చేయమన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. దీంతో బెదిరించారు. మరోవైపు.. పోలీసులు కూడా తన భర్తకు సంబంధించిన ఓ వీడియో చూపిస్తూ ఏవో పేపర్లపై సంతకాలు చేయమన్నారు. నా మీద, నా కుటుంబం మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు. మా కుటుంబానికి జగన్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారామె. జరిగింది ఏంటంటే..జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ పర్యటనకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ సింగయ్య అనే కార్యకర్త మరణించారు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మరణించాడంటూ నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో వైఎస్ జగన్తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే.. కక్షపూరిత రాజకీయంలో భాగంగానే ప్రభుత్వం తనపై కేసు పెట్టించిందని పేర్కొంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణికులపై కేసు ఎలా పెడతారని?.. సింగయ్య మృతికి జగన్ ఎలా కారకుడవుతారని? పోలీసులను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నాటి విచారణలో వైఎస్ జగన్ విచారణపై స్టే విధిస్తూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. -
బాబు మాటలు రాష్ట్రానికి చేటు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూత వైద్యుడి అవతారమెత్తారు. సొంత ఆలోచనో.. ఎవరైనా సలహా ఇస్తున్నారో తెలియదు కానీ.. భూతాల భాష మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రతిష్టనూ మసకబారుస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలోనే భూతాలు, దెయ్యాలు అంటూ మాట్లాడటం ఆయనకు, రాష్ట్రానికీ గౌరవం పెంచే పనైతే కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ద్వేషం, కోపం ఏమైనా ఉండవచ్చు. కానీ, అందుకోసం ఇలా తనను తాను భూత వైద్యుడిగా పోల్చుకుంటూ భూస్థాపితం చేస్తానంటూ ఉపన్యాసాలు చెబితే ఎవరికి నష్టం?. ఆధునిక సమాజంలో భూత వైద్యులను ఎవరైనా విశ్వసిస్తారా? అలా నమ్మేవారు ఎవరైనా ఉంటే వారు అమాయకులు, అంధ విశ్వాసాలను అనుసరించేవారై ఉంటారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళతారనో, లేక తాము చేసిన హామీలను నెరవేర్చుతారనో ప్రజలు ఓట్లు వేస్తే, వారికి భేతాళ మాంత్రికుడి కబుర్లు చెబితే ఎలా?. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, గత ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జగన్ ఎన్నడైనా ఈ భూతాల భాష వాడారా?. ఆయన హయాంలో రిలయన్స్ అంబానీ, అదానీ, జిందాల్, ఆదిత్య బిర్లా వంటి పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలు విశాఖలో సదస్సులో పాల్గొని ఏపీ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు!. వైఎస్ జగన్ దార్శనికతను ఎంతగానో మెచ్చుకున్నారు. వారిలో ఇప్పుడు ఎవరైనా జగన్ను భూతంగా చెప్పారా?. మళ్లీ అ భూతం వస్తుందా అని ఎవరైనా అడిగారా?. అది నిజంగా జరిగి ఉంటే వారి పేర్లు చెబుతారా?. అదేమీ లేకపోయినా చంద్రబాబు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నట్లు?. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం బాగుండాలి. వారికి అవసరమైన వసతులు, రాయితీలు కల్పించాలి. వైఎస్ జగన్ ఏమని చెప్పేవారు.. పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే.. తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అనేవారు. అంతే తప్ప అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అలాంటి సమావేశాలలో కానీ, ఇతరత్రా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు గానీ.. జగన్ ఒక్కమాటైనా అన్నట్లు లేదు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చింది. సంబంధిత పరిశ్రమలు ఆచరణలోకి రావడం ఆరంభమైందీ జగన్ టైమ్లోనే కాదా?. కర్నూలు వద్ద వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ కో ప్లాంట్ వచ్చింది జగన్ హయాంలోనే.. అప్పుడు వచ్చిన పరిశ్రమలు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసి తమ ఘనతేనని కూటమి పెద్దలు చెప్పుకోవడం లేదా?. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. కానీ, గత ప్రభుత్వంపై నిత్యం నిందారోపణలు చేస్తూ పెట్టుబడిదారులలో అనుమానాలు కల్గించేలా చేస్తే ఎవరైనా ధైర్యంగా పరిశ్రమలు పెడతారా?. అసలే కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా, శాంతిభద్రతల రీత్యా అంత అనుకూల వాతావరణం లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను కూటమి బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల నిర్వాకాల వల్ల పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి విద్యుత్ ప్లాంట్ల బూడిద గురించి కూడా కూటమి నేతలు గొడవలు పడ్డారే!.. అంతెందుకు! ఒక మాజీ ఎమ్మెల్యే తన ప్రాంతమైన తాడిపత్రిలో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేత ఒత్తిడితో పోలీసులు ఆయనను బలవంతంగా అనంతపురం తరలించారే. ప్రభుత్వ పెద్దలకు తెలియదా! ఇది మంచి వాతావరణమా?.సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై కక్ష కట్టి ప్రభుత్వం చేస్తున్న పనులు పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటాయా?. ఏదో ఒక సాకుతో సాక్షి మీడియా సంస్థలపై ఏపీ వ్యాప్తంగా దాడులు చేయిస్తే, దాడులకు తెగబడిన మూకలపై సరైన చర్య తీసుకోకపోతే శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా?. ఈ వార్తలు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియవా?. పారిశ్రామికవేత్తలు గమనించరా?. ఒక పారిశ్రామికవేత్తను సైతం ఒక మోసకారి నటి కేసులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించగా, ఆయన ఏపీలో కాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదించింది వాస్తవం కాదా?. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇలా భూతాల కబుర్లు చెబుతున్నారని పారిశ్రామికవేత్తలు ఊహించలేరా!. వైఎస్ జగన్ ఏపీలో ఎక్కడకు వెళుతున్నా ప్రజలలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి మాటలు అంటున్నారని వారికి తెలియకుండా ఉంటుందా?. జగన్ టైమ్లో పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ మీడియా చేయని ప్రయత్నం ఉందా?. ఆదానికి భూమి కేటాయిస్తే మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేశారే? ఇన్ని ఉదాహరణలు ఎదురుగా పెట్టుకుని జగన్ టైంలో విధ్వంసం జరిగిందని, భూతమని, మరొకటని డైలాగులు చెబితే పారిశ్రామిక వేత్తలు అంత అమాయకులా? నమ్మడానికి!. వారు అమాయకులైన సాధారణ ప్రజల మాదిరి కాదు కదా!. సాధారణ ప్రజలు ఎన్నికల సమయంలో బహుషా భూత వైద్యులను నమ్మి ఉండవచ్చు. ఇష్టారీతిన చేసిన వాగ్ధానాలకు ఆకర్షితులై ఉండవచ్చు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం అనుకుని ఓట్లు వేసి ఉండవచ్చు. లేదా ఈవీఎంల మహిమ ఉండవచ్చన్న భావన కూడా లేకపోలేదు.కూటమి అధికారంలోకి వచ్చాక కానీ.. వారికి భూత వైద్యులను నమ్మడం వల్ల లాభం లేదని తెలిసి ఉండవచ్చు. అందుకే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను తట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భూతం కబుర్లు చెప్పి ప్రజలను డైవర్ట్ చేయాలని తలపెట్టినట్లు కనిపిస్తుంది. ఆ భూతం రాదని తనది హామీ అని చంద్రబాబు అంటున్నారు. ఈసారి ఏమర పాటుగా లేనని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు అనిపించదా!. భూత వైద్యులను విశ్వసిస్తే ఉన్న వ్యాధులు పోకపోగా కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో భూత వైద్యుల పాలనలో అదే పరిస్థితి ఏర్పడుతోందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అండగా నిలబడాలి: వైఎస్ జగన్
పార్టీ యువజన విభాగం కార్యాచరణలో ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది. ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్లీ మళ్లీ కలుస్తాం. ఇది మనం మమేకం కావడంలో తొలి అడుగు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘‘రాజకీయాల్లో ఎదుగుదలకు యువజన విభాగంలో పదవి కీలకం.. అది తొలి అడుగు.. ఎమ్మెల్యే కావాలన్నదే ఆ పదవుల్లో ఉన్న వారి లక్ష్యం కావాలి...’ అని వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నిత్యం ప్రజలతో మమేకం కావడం.. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడం.. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచి వారితో కలిసి పోరాడడం.. ఈ మూడు లక్షణాలను పార్టీలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడి ఎదుగుతారని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు మంచి అవకాశం ఉంటుందని.. అందుకే చొరవ చూపి వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేశారు.‘ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. అయితే మీరు ఆ మూడు లక్షణాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో మీరు అది సాధించాలి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది కదిలి రావాలి..’ అని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం..పార్టీలో క్రియాశీలకంగా నిర్మాణ కార్యక్రమం సాగుతోంది. ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, వారు హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగడుతూ.. ఈ సర్కారును నిద్ర లేపుతున్నాం. ఇందులో చాలా క్రియాశీలకంగా ఉన్నాం. అయితే ఇంకా ఎదగాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు నాయకుడి దృష్టిలో పడతారు. అధికారంలో ఉన్నప్పుడు పాలకులకు పదవుల పంపకంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. కాబట్టి నాయకులపై దృష్టి అందరిపై అంతగా ఉండదు. ఎవరైనా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది సాధ్యం. మన పార్టీ నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది కొత్తవారే. మూడు లక్షణాలు అలవర్చుకోవాలి..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. అయితే అందుకు కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఒకటి.. నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఎప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. చిక్కటి చిరునవ్వుతో చక్కగా పలకరించాలి. అందరితోనూ అలాగే వ్యవహరించాలి. ఇంకా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారితో కలిసి పోరాడాలి. ప్రజల తరఫున నిలబడాలి. వారికి తోడుగా ఉండాలి. ఈ మూడు చేయగలిగితే ఎవరైనా నాయకుడిగా ఎదుగుతారు.అదే మీ లక్ష్యం కావాలి..నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్లకు చెబుతున్నా. ఈరోజు నుంచి మీరు పని మొదలు పెట్టండి. మీరు పిలుపునిస్తే కనీసం 2 వేల మంది రావాలి. ఇది నియోజకవర్గం ఇన్ఛార్జ్లకు ఇస్తున్న టార్గెట్. అలా లేకపోతే ఆ దిశగా కృషి చేయాలి. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ఇది మీ తొలి అడుగు. మీ చివరి అడుగు కనీసం ఎమ్మెల్యే కావడం. ఎదగడం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. కానీ మీరు పై మూడు గుణాలు పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకోవాలి. ఆరు నెలల్లో దాన్ని సాధించాలి. కార్యాచరణ ఇలా ఉండాలి..దీనికి తగ్గట్టుగానే గ్రామ, మండల, మున్సిపాలిటీ, వార్డు కమిటీలు ఏర్పాటు కావాలి. వాటిలో సమర్థులను నియమించండి. ఎదగడానికి సిద్ధంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకురండి. అసంఘటితంగా ఉన్నవారిని సంఘటితం చేయాలి. అలా మీరు పక్కా ప్రణాళికతో పని చేస్తే, చొరవ చూపితే, కృషి చేస్తే రాజకీయంగా బాగా ఎదుగుతారు. అప్పుడు మీరు ఒక్క పిలుపునిస్తే జనం కదిలి వస్తారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే కనీసం 5 వేల మంది రావాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోతే వెంటనే కమిటీల మీద దృష్టి పెట్టండి.వాటిని ఏర్పాటు చేయండి. వాటి పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేయండి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులకు చేదోడు వాదోడుగా ఉంటూ, సలహాలు ఇస్తూ వారిని చేయి పట్టుకుని నడిపించండి. తద్వారా మీరు ఎదుగుతారు. అప్పుడు మీరు పిలుపునిస్తే ఐదు వేలు కాదు.. 20 వేల మంది కదిలి వస్తారు. ఇక పార్టీ జోన్ విభాగం అధ్యక్షుడిగా మీరు పిలుపునిస్తే 10 వేల మంది రావాలి. అలా లేకపోతే, ఆ స్థాయికి ఎదగడం కోసం పక్కాగా ప్లాన్తో పని చేయండి. పార్టీలో కింది శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించడం మీ కార్యాచరణ కావాలి. అలా మీరు రాజకీయంగా ఎదిగాక, మీరు పిలుపునిస్తే పది వేలు కాదు.. ఏకంగా 40 వేల మంది వస్తారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్..ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగడం కోసం పార్టీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నాం. వారు మీకు అండగా ఉంటారు. యువ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువ నాయకులను ఆ పదవుల్లో నియమిస్తాం. ఆర్గనైజేషన్ తెలిసిన వారు మీకు తోడుగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెడతారు. అలా కేసులు పెట్టినా ఎదుర్కొనేలా.. పార్టీ మీకు అండగా, తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యంగ్ అభ్యర్థులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకొస్తున్నాం. వారు పార్టీ జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పని చేస్తారు.ఆ విభాగాలు బలంగా ఉండాలి..పార్టీలో సంస్థాగతంగా యువజన, మహిళ, విద్యార్థి, రైతు విభాగాలు చాలా బలంగా ఉండాలి. అలాగే ఎస్సీ, బీసీ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలి. అప్పుడు పార్టీ మరింత బలపడుతుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా అన్ని వ్యవస్థలు దృఢంగా ఏర్పడితే పార్టీ మరింత బలపడుతుంది. ఇంకా ఎదుగుతుంది. మీ ఫోన్.. మీ ఆయుధంఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో భాగస్వామ్యం కావాలి. ఇది సోషల్ మీడియా యుగం. కాబట్టి మీ ఫోన్ ఒక గన్ లాంటిది. అంటే అది ఒక ఆయుధం అన్నమాట. సోషల్ మీడియా ఎక్కౌంట్, యూట్యూబ్, ఎక్స్ పోస్టులు.. ఇలా అన్ని మాధ్యమాల్లో మీరు చురుకుగా ఉండాలి. గ్రామస్థాయి వరకు భాగస్వామ్యం కావాలి. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, పార్టీలో మా వరకు తెలియడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ ఈ మెసేజ్ వెళ్లాలి. ఎవరికి, ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా పార్టీ మొత్తం తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇదీ విజన్. ఇందులో భాగస్వాములు కావాలి. ఇది మీ అందరికీ తెలియాలి.విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట2011లో మన పార్టీని స్థాపించాం. నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నా వెనక ఎవరూ లేరు. నేను, అమ్మ.. ఇద్దరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాం. మా ఇద్దరితోనే పార్టీ ప్రస్థానం మొదలైంది. అప్పుడు నాతో రావడానికి కొందరు సిద్ధం కాగా.. ఇప్పుడు నా పరిస్థితే అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి, నాతో రమ్మని చెప్పను. రాజకీయంగా తెరమరుగైపోతావ్ అంటున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో నాతో రమ్మని చెప్పలేనన్నాను. దేవుడు దయ తలిచి, పరిస్థితులు చక్కబడ్డప్పుడు, నేను బాగున్నప్పుడు రమ్మని చెప్పా. ఎందుకంటే.. అప్పుడు నేను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఢీ కొడుతున్నా. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఏరోజూ వాటి విషయంలో రాజీ పడలేదు.ఒంటరిగా మొదలై ఎదిగాం..ఆ సమయంలో కాంగ్రెస్ను వీడి 18 మంది నాతో వస్తామన్నారు. వారందరినీ రాజీనామా చేయమని కోరా. అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కూడా వస్తానంటే తననూ రాజీనామా చేయమన్నా. అలా 18 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ రాజమోహన్రెడ్డి అందరం ఉప ఎన్నికలకు వెళ్లాం. అప్పుడు నాకు 14వ లోక్సభలో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏకంగా 5.50 లక్షల మెజారిటీ వచ్చింది. పార్లమెంట్లో అందరూ మనవైపే చూశారు. దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో... నాపై కక్ష కట్టారు. సిట్టింగ్ ఎంపీగా ఎం.రాజమోహన్రెడ్డి కాంగ్రెస్లో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి 15 మంది విజయం సాధించారు. ఎక్కడా విలువలు, విశ్వసనీయత తగ్గలేదు.కాంగ్రెస్ – టీడీపీ కుమ్మక్కు...నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు విపరీతంగా పెంచితే ఆ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. దానికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కోరినా.. చంద్రబాబు కలిసి రాలేదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చి, నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయి. దాంతో ఆ ప్రభుత్వం గట్టెక్కింది. అలా ఆ రెండు పార్టీలు విలువలు లేని రాజకీయం చేశాయి.టీడీపీకి దేవుడు మొట్టికాయ..రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. మన పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు గెలిచారు. అయితే వారిలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నారు. అలా అనైతిక రాజకీయాలు చేశారు. కానీ ఆ తరువాత ఏం జరిగింది? 2019లో జరిగిన ఎన్నికల్లో మన పార్టీకి అఖండ విజయం దక్కింది. అదే టీడీపీకి ఆ ఎన్నికల్లో దేవుడు మొట్టికాయ వేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా 23 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే అంతకుముందు మన పార్టీ నుంచి ఎంత మందినైతే అనైతికంగా లాక్కున్నారో, ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి సరిగ్గా అన్నే సీట్లు వచ్చాయి. -
ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై వైఎస్సార్సీపీ ధ్వజం
తాడేపల్లి : తమ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాధార ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డం ఎల్లో మీడియాకు ఒక అలవాటుగా మారిందని మండిపడింది. వైఎస్సార్సీపీని దెబ్బతీసే దురుద్దేశంతో తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కుట్రలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయిందని, సజ్జలపై ఆంధ్రజ్యోతి, ఈటీవీ-2 సహా ఇతర ఎల్లో మీడియాలో ప్రచురించిన, ప్రసారమైన వార్త కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. కార్యాలయానికి వచ్చే సందర్శకులకు అనుచరుడిగా ముద్రవేసి, వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ లేకుండా, నిర్ధారించుకోకుండా, కనీస ఆధారాలు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆపాదిస్తూ నిర్లజ్జగా వార్తా కథనం ప్రసారం చేయడం అత్యంత దారుణమని పేర్కొంది. ఆ వార్తల్లో పేర్కొన్న ప్రేమ్చంద్ అనే వ్యక్తితో కాని, అతనిపై వచ్చిన ఆరోపణలతో కాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ తెలిపింది. పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు వెనుకాడమని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. -
హాస్టల్లో పురుగుల పులుసు.. హోం మంత్రికి స్పెషల్ భోజనం
మంత్రిగారు.. అది కూడా హోం మంత్రి తన సొంత నియోజకవర్గంలో హాస్టల్ తనిఖీకి వచ్చారు.. మంత్రి వస్తున్నారంటే హాస్టల్ శుభ్రంగా ఉంచి ఆ ఒక్కరోజే అనే పిల్లలకు మంచి భోజనం పెట్టాలి కదా.. కార్యక్రమంలో పాయకరావుపేటలోని బీసీ బాలికల హాస్టల్ నిర్వాహకులు మంత్రి గారికి ప్రత్యేకంగా పురుగులతో చేసిన పులుసు వడ్డించారు.. ఇంకేముంది మంత్రి అనిత అవాక్కయ్యారు.. ఏంటి మంత్రిని నేను వస్తె పురుగుల భోజనం పెడతారా అని గదమాయించాడు. " ఏంజేస్తాం మేడం ఎలకల వేపుడు.. బల్లుల ఇగురు.. బొద్దింకల పచ్చడి పెడదాం అనుకున్నాం.. కానీ దొరకలేదు" అని సిబ్బంది లోలోన నవ్వుకున్నారు.ఈ క్రమంలో మంత్రి అనిత.. ఉన్నఫలంగా అధికారుల మీద ఫైరయ్యారు.. ఏంటి భోజనం ఎలా ఉంటుందా.. మీ విద్యాశాఖ ఇలా పనిచేస్తుందా అంటూ మీడియా కవరేజ్ కోసం కొన్ని డైలాగులు కొట్టారు. అంతా బానే ఉంది కానీ ఆవిడ వెళ్లిన హాస్టల్.. చేసిన భోజనం అంతా డీ ఫ్యాక్టో సీఎం లోకేష్ పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కొన్ని క్షణాలు మర్చిపోయినట్లున్నారు. ఏంటి.. నాకు పెట్టే భోజనంలోనే పురుగుల అని అధికారులపై చిరాకు చూపిస్తూ.. మీడియాకు న్యూస్ అందించారు.. అది కాస్త బ్యాక్ ఫైర్ అయిందని అధికారులు తెలుగుదేశం పెద్దలు అంటున్నారు. పురుగులు వస్తే వచ్చాయి పక్కకు తీసి పడేసి భోజనం చేసి భళా భళా అంటే సరిపోయేది కదా..సాక్షాత్తు లోకేష్ శాఖలో తప్పులు పట్టుకుని అనవసరంగా నెత్తిమీదకు తెచ్చుకున్నారు మంత్రిగారు అని పార్టీ నేతలు..కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.అమాయకత్వమో.. అత్యుత్సాహమో.. అజ్ఞానమో తెలియదు కానీ కూటమి క్యాబినెట్లో మంత్రులు ఒక్కోసారి ఇలాంటి హుషారు పనులు చేసి మీడియాకి న్యూస్ అయిపోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా మహిళలపై వరుస దాడులు జరుగుతున్న తరుణంలో హోం మంత్రి ఏం చేస్తున్నారు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేనే హోంశాఖ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.. అంటూ డైలాగులు పేల్చారు.. ఆ డైలాగులు ఆరోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచాయి. కానీ ఆయన చేసిన కామెంట్లు హోం మంత్రి అనితతో బాటు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. క్యాబినెట్లో రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏకంగా హోం మంత్రి పనితీరును తప్పు పట్టడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.ఆ తర్వాత ఆయన తన తప్పును తెలుసుకొని సైలెంట్ అయ్యారు అది వేరే విషయం. ఆ తర్వాత కాశీనాయన క్షేత్రం లో భవనాలు కూల్చివేతకు సంబంధించి లోకేష్ అత్యుత్సాహంతో వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ పరిధిలో ఉన్న భవనాలను లోకేష్ ఆదేశాల మేరకు కూల్చివేయడం పవన్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఆ తర్వాత ఆ అంశం సైలెంట్ అయింది. ఇప్పుడు అనిత కూడా నక్కపల్లి లో బాలికల హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడ పరిస్థితులను చూసి షాక్ అయ్యారు.43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే ఇంటికి వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. ముతక బియ్యంతో ఉడికే ఉడకని భోజనం పెడుతున్నారు. మెనూ అమలుకావడం లేదని విద్యార్థులు చెప్పడం గమనార్హం. అయితే విద్యార్థులతో కలిసి భోజనం చేద్దాం అని కూర్చున్న హోం మంత్రి అనితకు మొదటి ముద్దలోనే పురుగు వచ్చింది. అదేంటి నేను వచ్చిన రోజు కూడా ఇలాంటి భోజనమే పెట్టారు అంటే మిగతా రోజుల్లో ఇంకెలా ఉంటుందో అంటూ ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.ముఖ్యమంత్రి కొడుకు హోదాలో అన్ని శాఖల్లోనూ దూరీపోవడమే కాకుండా.. ఇటు హోంశాఖ తో పాటు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే బాధ్యత వారిని టార్చర్ చేసే వ్యవహారాలన్నీ చూస్తున్న లోకేష్ ఏకంగా విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేశారు. టీచర్ల బదిలీలు పాఠశాలల రేషన్లైజేషన్ ఇదంతా పెద్ద గందరగోళంగా మారింది. దీంతో ఆయన హాస్టల్లు విద్యార్థులు భోజనాలు వంటి చిన్న చిన్న అంశాలను పట్టించుకోవడమే మానేశారు. ఈ అంశం ఏకంగా హోం మంత్రి పర్యటనలోనే వెల్లడి కావడంతో ఆమె ఇది లోకేష్ బాబు శాఖ కదా కాస్త చూసి చూడనట్టు పోదాం అని సర్దుకోకుండా ఇంత దరిద్రంగా ఉంది ఏంటి అని ఓపెన్ గా కామెంట్ చేశారు. అంటే లోకేష్ తన శాఖను సరిగ్గా చూడటం లేదని ఆమె చెప్పకనే చెప్పేశారు. ఆమె కామెంట్ ఆమె పీకల మీదకు తెస్తుందా ఏమో అని కార్యకర్తలు లోలోన చెవుల కొరుక్కుంటున్నారు.-సిమ్మాదిరప్పన్న -
యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు: జక్కంపూడి రాజా
సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం ప్రతిసారీ యువతను నమ్మించి మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి భృతి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏదని ప్రశ్నించారు.చివరికి మెగా డీఎస్సీ అంటూ సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే ఏడాది కాలంగా విలువలేని దారుణమైన పాలన ఏపీలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న మోసాలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..వైఎస్సార్సీపీ యువజన విభాగంతో ఇవాళ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలపై గొంతెత్తాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో వైఎస్సార్సీపీ యువజన విభాగం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. వైఎస్ జగన్ని సీఎం చేసే దాకా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యేలా చూస్తాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే ఆయన సీఎం కావాలి. ప్రభుత్వం కుట్రలు చేయడం మాని ఇకనైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వమిదివైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ ప్రకటించిన టీచర్ పోస్టులను భర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారు. ఏడాది పూర్తయినా దానికి దిక్కుమొక్కు లేకుండా చేశాడు. 2014లో నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, 2024 లోనూ నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. చంద్రబాబుకు వంతపాడే ఈనాడు పత్రిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటే గత ఏడాది వారందరికీ ఒక్కొక్కరికి రూ. 36 వేలు చొప్పున చంద్రబాబు బకాయి పడ్డాడు. ఒక్క నిరుద్యోగ భృతి పేరుతోనే రూ.56 వేల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం బకాయిపడింది.కొత్త ఉద్యోగాల భర్తీ లేదు.. ఉన్న ఉద్యోగాల తొలగింపుకూటమి మేనిఫెస్టోలో ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏడాది గడిచినా రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి సూపర్ సిక్స్ పేరుతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకాలు చేసిన బాండ్లు పంపిణీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఒక్కో వ్యవస్థనూ ఎత్తివేస్తూ ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు.వలంటీర్ల గౌరవం వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పిన ఈ కూటమి పెద్దలు, చివరికి వారిని రోడ్డుపాలు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 33 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా రేషనలైజేషన్ పేరుతో ఉన్న ఉద్యోగులే ఎక్కువని తేల్చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను తీసేసి 15 వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో పనిచేసే 18 వేల మంది ఉద్యోగులను తొలగించారు.ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి దాదాపు 2,360 మందికి ఉపాధి లేకుండా చేశారు. ఏపీఎండీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే దాదాపు 400 మంది ఉద్యోగులను, ఉద్యోగుల జీతాన్ని దళారులు దోచుకోకుండా కోతల్లేకుండా శాశ్వత ఉద్యోగులకు దక్కే అన్ని సౌకర్యాలు కల్పించిన ఆప్కాస్ అనే వ్యవస్థను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్ జగన్ పాలనలో 6.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలువైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు అండగా నిలిచారు. ఉద్యోగాల భర్తీ నుంచి, ఉపాధి కల్పన వరకు చక్కని ప్రణాళికతో పాలనను సాగించారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. ఒకేసారి దాదాపు 1.36 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి సంక్షేమ పథకాలను ఇంటికే అందించారు.ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఐదేళ్లలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 48 వేల ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి. ఏపీయస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యకు ఎండ్ కార్డ్ వేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా 33,82,242 మందికి ఉపాధి లభించింది. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టులో పొందుపర్చడం జరిగింది. -
అయ్య బాబోయ్ ఇంటింటికీనా..!
అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు..తర్వాత వాటిని గాలికొదలడంతో ఐదేళ్ల వ్యతిరేకతను ఏడాదిలోనే మూటగట్టుకున్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా ఏ వర్గాన్ని కదిలించినా కూటమి పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన అంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క పల్లెకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఏడాదిలో చేసిన ‘సుపరిపాలన’ను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు చెబుతుండడంతో ప్రజల వద్దకు వెళ్లి ఏం చేశామని చెప్పాలంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఓవైపు రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాం.. మరోవైపు పెన్షన్ మినహా అన్ని పథకాలకూ మంగళం పాడాం.. ‘అమ్మ ఒడి’ సగం కోతలు, సగం వాతలు తరహాలో ఇచ్చాం.. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ వెళితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లడం అంత మంచిది కాదని చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.కబ్జాలు, ఆక్రమణలతో వణుకు జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల అనుచరులు భూ ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడిముబ్బడిగా చేశారు. దీంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరకు వెళ్తే నిలదీసి కడిగిపారేస్తారన్న భయం ఎమ్మెల్యేల్లో ఉంది. అంతేకాదు తమ కార్యకర్తలు ఏం చేసినా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి విడిపించుకుంటున్నారు. బాధితులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ‘తమ్ముళ్లు’ దాడులు చేసినా బాధితులకు న్యాయం లేదు. దీంతో ఎమ్మెల్యేలు తమ వార్డుల్లోకి వస్తే నిలదీసేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.మహిళలు ‘బెల్టు’ తీస్తారు..! ఉమ్మడి జిల్లాలో 230 వైన్ షాపులుండగా.. 2,100 బెల్టుషాపులు ఉన్నాయి. ఈ క్రమంలో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుండడంతో పేద కుటుంబాలు గుల్లవుతున్నాయి. దీంతో మహిళల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల నిరసనలకు దిగారు. ఇలాంటి సమయంలో పల్లెలకు ఎమ్మెల్యేలు వెళితే ‘బెల్టు’ తీస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఉద్యోగులు నిజం తెలుసుకున్నారు.. ఉద్యోగులందరూ ఎన్నికల్లో టీడీపీకి గంపగుత్తగా ఓట్లేశారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నాయి. బదిలీల్లో నాయకుల పాత్రపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సిఫార్సు లేఖలు, లంచాలతో తమకు కావాల్సిన వారిని దగ్గరకు చేర్చుకోవడంతో వేలాది మంది సామాన్య ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విభాగం బదిలీలోనూ అవినీతి అక్రమాలే. ఈ సమయంలో ఎమ్మెల్యేలకు అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆగ్రహంలో రైతన్నలుప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది వచ్చినా పైసా ఇవ్వలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా రూపాయి అందించలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ‘ఎమ్మెల్యేలైతే మాకేంటి..ఊర్లోకి వస్తే చూస్తాం’ అంటూ మండిపడుతున్నారు. -
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా రాజీ పడలేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం. పార్టీ ప్రారంభించిన కొత్తలో అందరూ కొత్తవాళ్లే. పార్టీ పెట్టిన కొత్తలో నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నవాళ్లు నాతో వచ్చారు. నా ప్రస్థానం అక్కడ నుంచి మొదలయ్యింది.. .. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది. పార్లమెంటులో ప్రతి సభ్యుడూ మనవైపు చూసే పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించాను. ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసే పోటీచేశాయి. 2014లో 67 మందితో గెలిచాం. మళ్లీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారు. .. ఎన్నికష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాం. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలి. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవి చేయగలిగితే.. లీడర్గా ఎదుగుతారు. యూత్ వింగ్లో ఉన్న వారు ప్రభావంతంగా పనిచేయాలి. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉంది. పెరగాలంటే.. మీరు కష్టపడాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయండి. సమర్థత ఉన్నవారిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురండి. పార్టీని వ్యవస్థీకృతంగా బలోపేతం చేయాలి... మీ పనితీరును మీరు ఎప్పటికప్పుడు మీరే మదింపు చేసుకోండి. జోన్ల వారీగా యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా పెడుతున్నాం. ఎమ్మెల్యేలుగా పోటీచేసిన యువకులు దీనికి ఉంటారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోకి రావాలి. వాస్తవాలను చెప్పడానికి ఇది ఒక ఆయుధం. అన్యాయాలను, అక్రమాలను ఈ మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకురావాలి. ప్రజలందరి దృష్టికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. ఎవరికి, ఏ అన్యాయం జరిగినా సమాజం దృష్టికి తీసుకు రావాలి అని వైఎస్ జగన్ సూచించారు. ఈ భేటీలో యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. -
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ 'సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ పలువురు బాలికలు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె చేసేది లేక అధికారులపై చిందులు తొక్కారు. హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఆమె అక్కడి బాలికల గురుకుల హాస్టల్ను సందర్శించారు. ఆ టైంలో గురుకుల హాస్టల్స్ దుస్థితి వెలుగులోకి వచ్చింది. భోజనంతో పాటు మెయింటెనెన్స్ కూడా బాగా లేదంటూ విద్యార్థినిలు హోం మంత్రికి చెప్పారు. దీంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు.‘‘43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇద్దరు అధికారులను ఎత్తేస్తే అందరికీ బుద్ధి వస్తుంది అంటూ ఆమె అధికారులపై మండిపడ్డారు. -
దేవుడు చూస్తూ ఊరుకోడు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కాం కేసు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను అక్రమంగా ఇరికించారని మీడియా ముందు వాపోయారాయన. ఈ కేసులో సిట్ కస్టడీకి తరలించే క్రమంలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు.‘‘నాపై తప్పుడు కేసులు పెట్టారు. అన్నింటికీ కాలం సమాధానం చెబుతుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు’’ అని అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు నేటి(జులై 1వ తేదీ) నుంచి చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని సిట్ మూడు రోజులపాటు విచారించనుంది.విచారణకు ముందు జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. -
బాబు, పవన్ను ఓడిద్దాం.. ముస్లింలకు అసదుద్దీన్ పిలుపు
కర్నూలు (టౌన్): బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ‘వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరువరన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణల్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచి్చనా టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లను ఆయన వర్గీయులు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తోందన్నారు. పహల్గాంలో అమాయకులను ఊచకోత కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్ దేశంలో పేట్రేగిపోతోందని, మసీదులు, దర్గాలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ముస్లిం మతపెద్దలు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు. -
వారు దుండగులు కాదా?.. టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ల చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్ లో ఒక న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కాని వారు అన్ని విషయాలలో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్ లో ఒక టీవీ చానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విద్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు,సమాజం దీనిని ఆమోదించదని అంటూ,ఆ ఛానల్ యాజమాన్యానికి ,సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియచేశారు. 👉చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికి గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికి అయినా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తమకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది.👉ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్ కు సంబందించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళనలు చేయించిన తీరు,ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా.. జర్నలిస్టులను అరెస్టు చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందినవారు చేసిన దాడులు,వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్దతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా!. పైగా అనని మాటలు అన్నట్లుగా, ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరిని ఆశ్చర్యపరచింది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు లు చేయలేదు? అలా చేసినవారు దుండగులు కాదా?వారు టీడీపీ వారైతే ఏ పనిచేసినా ఓకేనా?ప్రజాస్వామ్యంలో బెదిరింపులు ,దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా?.. దీనికి ఆయన ఏమి జవాబిస్తారు. నిత్యం సాక్షిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతు ఇచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రమే స్వేచ్చ ఉండాలని చెప్పడం సహేతుకమే అవుతుందా?. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం.👉సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరం అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. దానిపై వివరణ కోరవచ్చు. కాని అసలు ఆ పదం పలకని జర్నలిస్టునే అరెస్టు చేశారే!. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే, తెలుగుదేశం మీడియా సంస్థలు వందల సార్లు ప్రచారం చేశాయి. అలాగే లక్షల పత్రికలలో దానిని యధాతధంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దానిని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా?. కాని ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు. వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా!, మరి వారిపై కేసులు పెట్టరా?దీనిపై ప్రభుత్వంకాని, పోలీసు కాని, న్యాయ వ్యవస్థకాని ఎందుకు స్పందించలేదంటే ఏమి చెబుతాం. హైదరాబాద్ లో దాడికి గురైన టీవీ చానల్ కొన్ని వీడియాలకు పెట్టిన తంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరం చెప్పం. చట్టప్రకారం పోవాల్సిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే!. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు , ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలోప్రభుత్వం.. వాళ్లకు బంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు.. చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు!!.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాష్ట్రం అంతా గంజాయి కేంద్రం అయిపోయిందని చంద్రబాబు,ఇతర కూటమి నేతలుతీవ్ర విమర్శలు చేసేవారు. అంటే అప్పుడు ఏపీలో ఉన్నవారంతా గంజాయి తీసుకుంటున్నారని చంద్రబాబు అన్నట్లు భావించాలా?. పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా?. అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా?. అయినా ఎవరిపైన ఎందుకు కేసులు పెట్టలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాని తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షిపై దాడి చేయడం ,కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్దం అని వారు భావిస్తున్నట్లా?. సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా?. అంతెందుకు.. సాక్షి టీవీ చానల్ ప్రజలలోకి వెళ్లరాదన్న ఉద్దేశంతో ఆయా నగరాలలో ,పట్టణాలలో కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి సాక్షి ప్రసారం కాకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మీడియా స్వేచ్చ గురించి నీతులు చెబితే ఎవరైనా నమ్ముతారా?.. చంద్రబాబు కు ఇది కొత్తేమి కాదు. 2014 టైమ్లో కూడా కూడా సాక్షితో పాటు మరికొన్ని చానళ్లపై కూడా ప్రత్యక్షంగానో,పరోక్షంగానో నిషేధం పెట్టారు. అప్పట్లో కాపుల రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే,ఆ వార్తలు ప్రచారం కాకుండా ఎన్నిరకాల ఆటంకాలు కలిగించారో అందరికి తెలుసు. ఈసారి కూడా సాక్షి టీవీతో మరో రెండు చానళ్లపై కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. ఇదీ చంద్రబాబుకు మీడియా స్వేచ్చపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్న సూత్రం బాగా వర్తిస్తుందా?ఇక పవన్, లోకేష్ లు కూడా టీవీ చానల్ పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట.ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి,అదేదో గొప్పపనిగా ఛాతి విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీనినే హిపోక్రసి అంటారు.అలా అని హైదరాబాద్ లో దాడి ఘటనను సమర్ధించడం లేదు.కాని ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండుకళ్ల సిద్దాంతంతో సాగుతుండడమే బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేపు వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ యువజన విభాగం సభ్యులతో రేపు (మంగళవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. రేపు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమవనున్నారు. ఈ భేటీలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, యువజన విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొంటారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
సంక్షేమానికి నిజమైన అర్థం.. వైఎస్ జగన్ పాలన: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అ«ధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యంమన్నారు. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. మన నాయకుడు వైఎస్ జగన్ శక్తి కూడా కార్యకర్తలేనని.. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు.‘‘వైఎస్ జగన్ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్ సెక్టార్స్ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది’’ అని సజ్జల పేర్కొన్నారు.అడ్డుకుంటూ.. అరాచకం:మరో వైపు జగన్ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.అప్రకటిత ఎమర్జెన్సీ:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.వైఎస్సార్సీపీ.. మైనారిటీ సంక్షేమం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్వర్క్ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్సీపీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల.. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు. -
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
బదిలీల పేరుతో ఉద్యోగులకు కూటమి సర్కార్ వేధింపులు: చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: బదిలీల పేరుతో కూటమి సర్కార్ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల బదిలీలను సైతం కూటమి ఎమ్మెల్యేలు తమ అక్రమార్జనకు ఆదాయ వనరుగా మార్చుకుంటున్న దారుణమైన పరిస్థితి ఏపీలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయికి పాలనను అందించేందుకు వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేస్తూ, అందులోని సిబ్బంది సంఖ్యను కుట్రపూరితంగా తగ్గించివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఎవరు డబ్బులిస్తే వారికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వేగంగా బదిలీలు జరిగిపోతున్నాయి. అనధికారికంగా బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తప్పనిసరి చేస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దాదాపు 95 శాతం బదిలీలు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1.40 లక్షల మంది ఉద్యోగుల బదిలీల కోసం జీవోఎంస్ నెంబర్ 5 ని విడుదల చేశారు. వైయస్సార్సీపీ హయాంలో చివరి ఏడాది నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బదిలీల పేరుతో ఉద్యోగులను వేధిస్తున్నారు.సచివాలయ వ్యవస్థపై కక్షసాధింపువైఎస్ జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయాల వ్యవస్థకు మంచి పేరు రావడంతో దాన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఇప్పుడు సచివాలయాల్లో బదిలీల పేరుతో ఉద్యోగులను వేరే మండలాలకు బలవంతంగా పంపించి వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక రూల్, పట్టణాల్లో వార్డు సచివాలయాల్లో పనిచేసేవారికి వేరే రూల్ వర్తింపజేస్తున్నారు. బదిలీల పేరుతో చిన్నస్థాయి ఉద్యోగులను డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నారు. ప్రభుత్వమే ఉద్యోగుల చేత తప్పులు చేయించే కార్యక్రమానిక ఉసిగొల్పుతున్నట్టుంది.పనివేళల్లోనే బదిలీలు పూర్తిచేయాలిభర్త చనిపోయి వితంతువులుగా ఉన్న ఉద్యోగులకు, కేన్సర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడేవారికి, స్పౌస్ కేస్ల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నా, వారి అభ్యర్థనలను పట్టించుకోవడం లేదు. గ్రామ సచివాలయాల బదిలీలకు జూన్ 30తో గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో 12 రోజుల కిందట డెలివరీ అయిన ఒక బాలింతరాలు, ఒక మహిళా ఉద్యోగిని కౌన్సిలింగ్ పేరుతో ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకూ కుర్చోబెట్టి వేధించడంతో ఆమె అస్వస్థతకు గురై ఇంటికెళుతూ మార్గమధ్యలో చనిపోయింది. ఆమె కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? నిబంధనల ప్రకారమే ఆఫీసు వేళల్లోనే ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలి. రాత్రింబవళ్లు తిప్పించుకుని వేధించడం ఆపాలి. -
అవకాశవాదులకు బైబై.. సొంత కార్యకర్తలకు జైజై
భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు లేకుండా నికార్సైన బిజెపి కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావుని అధ్యక్షునిగా నియమించగా ఆంధ్ర ప్రదేశ్కు పివిఎన్ మాధవ్ ను సారధిగా నియమించారు. ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బిజెపి పెద్దలు క్షమించే ఉద్దేశంలో లేకపోబట్టి ఆవిన్ను పక్కకు తప్పించారు. వాస్తవానికి ఆవిడ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె అయినప్పటికీ కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎంపీగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. ఇక్కడ ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఆమె మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆమె సామాజిక వర్గం వ్యాపార వర్గంతోబాటు ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగానే ఉంటూ వచ్చారు తప్ప బీజేపీకి ఆమె ఏనాడు ఉపయోగపడలేదు. బిజెపి పేరు చెప్పుకొని ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఆమె ఎదగనివ్వలేదు. ఏదైతేనేం మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటినుంచి అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురందేశ్వరిని తప్పించాలని హార్డ్ కోర్ బిజెపి కార్యకర్తలు కోరుతూ వస్తున్నారు. పురందేశ్వరి ఎంత సేపు తన కుటుంబ పార్టీ ఆయన చంద్రబాబుకు తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు తప్ప బిజెపి బలోపేతానికి వీసమెత్తు కృషి కూడా చేయలేదు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి జన్మతః బిజెపి కార్యకర్త ఆయన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.విశాఖనగరానికి చెందిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ టర్మ్ పదవి ముగిసాక 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి మాధవ తండ్రి పీవీ చలపతిరావు సీనియర్ బిజెపి నాయకుడు. అద్వానీ వాజ్పేయి వంటి దిగ్గజాలతో కలిసి నడిచిన వాడు. చలపతిరావు అంటే మోడీ ఇతర బిజెపి పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. నికార్సైన చలపతిరావు కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్ కు ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నియామకం తెలుగుదేశంతోపాటు అవకాశవాద రాజకీయాలు నేరిపే పురందేశ్వరికి షాకింగ్ అని చెప్పాలి.పార్టీ ఆలోచనలు పార్టీ గీత దాటి అడుగు వేయని నిబద్ధత కలిగిన మాధవ్ ఏ విషయంలోనూ తెలుగుదేశానికి తలవంచకుండా పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారు అని బిజెపి కార్యకర్తలు నమ్ముతున్నారు. అన్నిటికి మించి చంద్రబాబు బంధువు అయిన పురందేశ్వరి కబ్జా నుంచి బిజెపిని విడిపించడం అతి పెద్ద అడుగు అని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బిజెపిని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలు పరపతి పెంచుకున్న పురందేశ్వరికి ఈ నిర్ణయం చేదుగానే ఉంటుంది కానీ నిజమైన బిజెపి కార్యకర్తలకు మాధవ నియామకం తీపి కబురు అని చెప్పాలి.-సిమ్మాదిరప్పన్న