తన సోదరుడు మరణించిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఢిల్లీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ప్రపంచం మొత్తం చీకటిగా మారిందని.. ఏం చేయాలో అర్థంకావడం లేదని ఉద్వేగానికి లోనయ్యాడు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఈశాన్య ఢిల్లీలో సోమవారం చెలరేగిన హింసలో గాయపడిన మహ్మద్ ఫర్కాన్ అనే వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో మృతుడి సోదరుడు మహ్మద్ ఇమ్రాన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... పిల్లలకు భోజనం తెచ్చేందుకు ఫర్కాన్ బయటికి వెళ్లాడని.. ఈ క్రమంలో బుల్లెట్ తగిలి మృత్యువాత పడ్డాడని పేర్కొన్నాడు. ఫర్కాన్కు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారిద్దరు ఇప్పుడు తండ్రిలేని వారయ్యారని కన్నీటిపర్యంతమయ్యాడు.