అల్లుడు, కొడుక్కి పెద్దపీట: ఎర్రబెల్లి | ttdp-leaders-takes-on-kcr-govt | Sakshi
Sakshi News home page

Mar 11 2015 5:58 PM | Updated on Mar 21 2024 7:54 PM

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై టీటీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా వాస్తవాలు బయటపడ్డాయన్నారు. రాష్ట్రంలో విజృంభించిన స్వైన్ ఫ్లూను అరికట్టలేదు కాని... హెలికాప్టర్ అంబులెన్స్లో వైద్యం అందిస్తామని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామనే... జాతీయగీతం అడ్డంపెట్టుకుని మా గొంతు నొక్కారని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ... కేబినెట్లోనే కాదు నిధుల కేటాయింపులో కూడా మహిళలకు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించిన ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మండలిలో టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశామనడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షపార్టీ లేకుండా గతంలో ఎన్నడూ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టి అల్లుడు, కొడుక్కి పెద్దపీట వేశారని ఆరోపించారు. డబ్బులు రావని పాత ప్రాజెక్ట్లు పక్కన పెట్టి... కొత్త ప్రాజెక్టులు బడ్జెట్లో చేర్చారని విమర్శించారు. కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ ఉందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. విద్యార్థులు, అమరవీరులు, రైతు ఆత్మహత్యలపై బడ్జెట్లో ప్రస్తావనే లేదని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement