దేశంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం బాగా పెరిగిపోయిందని, ఇప్పుడు కళ్లకో డాక్టర్, కాళ్లకో డాక్టర్, చేతులకో డాక్టర్.. ఇలా వస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాబోయే రోజుల్లో కుడిచేతికి ఒక డాక్టర్, ఎడమ చేతికి మరో డాక్టర్ వస్తారేమోనని ఆయన చమత్కరించారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాత రోజుల్లో ఊరి మొత్తానికి ఒకరే వైద్యుడు ఉండేవారని, ఆయన నాడి పట్టుకుని చూసి ఏం సమస్య ఉందో చెప్పేవారని గుర్తు చేశారు. ఆ తర్వాతి కాలంలో ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చారని.. వాళ్లు పది పదిహేను రకాల ప్రశ్నలు అడిగి ఆరోగ్య సమస్య ఏంటో తెలుసుకునేవారని చెప్పారు.