కడప అర్బన్ : కడప నగర శివార్లలోని కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారంలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రామ గోపాల్, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ తమ సిబ్బందితో ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఖైదీలతో మాట్లాడి కేసుల వివరాలు, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖైదీలకు అవసరమైన వారికి వీల్ చైర్స్, వాకర్స్, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యత తెలియజేశారు. లీగల్ ఎయిడ్ బాక్సులను పరిశీలించారు. జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం, మానసిక వ్యాధులతో బాధపడే ఖైదీల ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సకాలంలో మందులను వాడాలని తెలియజేశారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100పై ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్ కుమార్, రాయచోటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నూతనగంటి తేజస్విని, పురుషుల, ప్రత్యేక మహిళ కారాగారాల సూపరింటెండెంట్లు వెంకటేశ్వరరావు, కృష్ణవేణితోపాటు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, పానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు, ఖైదీలు పాల్గొన్నారు.


