పులివెందుల : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త వైఎస్ కమలమ్మ అంత్యక్రియలు శనివారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆమె గత ఆదివారం అమెరికాలో తన కుమార్తె మెర్సీ ఇంట్లో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కమలమ్మ భౌతికకాయాన్ని అమెరికా నుంచి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు పులివెందులకు తీసుకొచ్చారు. భాకరాపురంలోని జీసెస్ చారిటీస్ అనాథ శరణాలయంలో ఆమె గృహం వద్ద భౌతికకాయాన్ని ఉంచారు. ఆమె భౌతికకాయానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్ సోదరులు రవీంద్రనాథరెడ్డి, సుధీకర్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ జోసఫ్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, చవ్వా దుశ్యంత్రెడ్డి, దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు ఈసీ దినేష్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమలమ్మ కుమారులు క్రిష్టోఫర్, స్మిత్, కుమార్తె మెర్సీలను పరామర్శించి ఓదార్చారు. పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్సార్ సమాధుల తోటలో శనివారం సాయంత్రం కమలమ్మ అంత్యక్రియలు ముగిశాయి. కమలమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెతో వారికున్న అనుబంధం, ఆమె ఇతరులపట్ల చూపే ప్రేమాభిమానాలను గుర్తుకు తెచ్చుకున్నారు.
నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి


