కడప, సాక్షి ప్రతినిధి: జిల్లాలో అక్రమ మైనింగ్ మాఫియా అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. తమ అక్రమార్జనకు, కోట్ల రూపాయల పగటిదోపిడీకి అడ్డుగా నిలుస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో సామాజిక, రాజకీయ నేత, ఎంబసీ గ్రూప్ కేర్టేకర్ వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము)ని ఎలాగైనా సరే అంతమొందించేందుకు ప్రత్యర్థులు దారుణమైన వ్యూహాలు పన్నుతున్నారు.
3 వేల టన్నుల ఖనిజం లూటీ..
‘బీటెక్ రవి’అనుచరులపై ఫిర్యాదు!
వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన ఎల్.రామలింగారెడ్డి కుటుంబానికి 25 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన 2019 నుంచి ఎంబసీ గ్రూప్ సంస్థకు అధికారిక కేర్టేకర్గా వ్యవహరిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిఫెన్ బరైటీస్ మైనింగ్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా అక్రమ మైనింగ్కు తెరలేపారు. ఈ క్రమంలోనే 2025 జనవరి 15న (సంక్రాంతి పండుగ రోజున) కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన దాదాపు 3 వేల టన్నుల బరైటీస్ ఖనిజాన్ని దొంగ ముఠా రాత్రికి రాత్రే అపహరించింది. ఈ మహా దోపిడీ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పరోక్ష సహకారంతో పాటు ఆయన అనుచరులైన పేర్ల పార్థసారధిరెడ్డి, పేర్ల శేషారెడ్డి, మబ్బుచింతలపల్లె శ్రీనాథరెడ్డి, మారెడ్డి జోగిరెడ్డిల ప్రత్యక్ష ప్రమేయం ఉందని రాము రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లాకు చెందిన ఇంతటి పెద్ద తలకాయల పేర్లను బయటపెట్టినప్పటి నుంచి వేల్పుల రాము ప్రాణాలకు ముప్పు విపరీతంగా పెరిగింది.
భద్రత కల్పించకుండా అడ్డుపడ్డ ప్రభుత్వం.. నల్లగొండుగారిపల్లెలో హత్యాయత్నం!
టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, తనకు గన్మెన్ కేటాయించాలని గతంలో రాము హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు
(WP 9349/2025) తక్షణమే వన్ ప్లస్ వన్ గన్మెన్ సౌకర్యం కల్పించాలని 2025 ఏప్రిల్ 9న ఆదేశించింది. ఆ మేరకు ఏప్రిల్ 17న జిల్లా ఎస్పీని కలిసి భద్రత కోరగా.. ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీలుకు వెళ్లి ఆ భద్రతను అడ్డగించారు.
ప్రభుత్వ పెద్దల అండతో రెచ్చిపోయిన మాఫియా
2025 ఆగస్టు 6వ తేదీన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా నల్లగొండుగారిపల్లెలో రాముపై అత్యంత దారుణంగా హత్యాయత్నానికి ఒడిగట్టింది. కత్తులు, రాడ్లతో టీడీపీ నేతలు స్వైర విహారం చేయగా, ఆ గ్రామానికి చెందిన ధైర్యవంతులైన మహిళల చొరవ కారణంగా వేల్పుల రాము తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
సుప్రీం కోర్టు సీరియస్
శుక్రవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక తీర్పు!
రాష్ట్రంలో తనకు రక్షణ దక్కకపోవడంతో వేల్పుల రామలింగారెడ్డి తన ప్రాణాలను కాపాడుకునేందుకు సుప్రీం కోర్టును స్పెషల్ లీవ్ పిటిషన్ (LP 31993/2026) ద్వారా ఆశ్రయించారు. దీనిపై విచా రించిన సుప్రీం కోర్టు, ఈనెల 22కు కేసును వాయిదా వేస్తూనే.. ఆలోపు హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునేలా, ఆ నిర్ణయంపై హైకోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వేల్పుల రాము న్యాయవాదులు హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఆశ్రయించారు.ఈ మేరకు శుక్రవారం కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. బాధితుడి ప్రాణాపాయ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సంచలన తీర్పు వెలువరించారు. తక్షణమే కడప జిల్లా ఎస్పీని స్వయంగా కలిసి భద్రత కోసం మరోమారు అధికారికంగా ఫిర్యాదు చేయాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి హత్యాయత్నం నుంచి తృటిలో ప్రాణా లు దక్కించుకున్న వేల్పుల రామలింగారెడ్డికి, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలోనైనా ఈసారైనా పోలీసు అధికారులు పూర్తిస్థాయి భద్రత కల్పించి రక్ష ణ ఇస్తారో లేదో వేచిచూడాల్సిందేనని జిల్లా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలతో
హైకోర్టు చీఫ్ జస్టిస్ సంచలన తీర్పు
తక్షణమే ఎస్పీని కలవాలని ఆదేశం
కూటమి సర్కార్లో ‘పచ్చ’ మాఫియా
3 వేల టన్నుల బరైటీస్ ఖనిజం అపహ రణపై ఫిర్యాదు చేయడమే శాపమైంది


