కడప సెవెన్రోడ్స్ : జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 ప్రవేశ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ‘నీట్’ పరీక్ష నిర్వహణపై ఎస్పీనచికేత్ విశ్వనాథ్, డీఆర్వో మల్లికార్జునుడు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 3,148 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా కడపలో 8 కేంద్రాలు, ప్రొద్దుటూరులో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 264 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లుతెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ నీట్ (యూజీ)–2026 పరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా, పరీక్ష నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కడప, ప్రొద్దుటూరు సిటీ కో ఆర్డినేటర్స్ మునీష్ మీనా, జయచంద్రా రెడ్డి, పోలీసు, రెవెన్యూ, ఏపీఎస్పీడిసిఎల్, మెడికల్, లేబర్, డిసేబుల్, పోస్టల్ తదితర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్వాధీన సామగ్రి భద్రతపై ప్రత్యేక దృష్టి
ఎన్డీపీఎస్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తు సామగ్రి భద్రత కోసం జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మంగళవారం రాష్ట్ర రాజధాని నుండి రాష్ట్రక్క్ఆ హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ ఎస్. కమలాకర రెడ్డి సంబంధిత న్యాయమూర్తులతో కలిసి.. ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్) చట్టం కింద స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల భద్రత కోసం జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న శాశ్వత నిల్వ కేంద్రాల నిర్మాణ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరై జిల్లాలో ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వస్తువుల తాత్కాలిక, శాశ్వత భద్రతా ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలు, నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర హైకోర్టు జ్యూడిషియల్ రిజిస్ట్రార్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


