ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్లో జరిగిన రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ చోరీ కేసులో ఎట్టకేలకు త్రీ టౌన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ మెగా స్కామ్లో ప్రధాన నిందితుడు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యంను పోలీసులు సోమవారం రాత్రి అధికారికంగా అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.
ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్ నుంచి ఇటీవల సుమారు 268.71 టన్నుల ప్రభుత్వ ఐరన్ మాయమైంది. ఈ గోడౌన్కు ఇన్చార్జిగా ఉన్న ఏఈ సుబ్రమణ్యం ప్రమేయం లేకుండా ఇంత భారీ ఎత్తున ఐరన్ పక్కదారి పట్టే అవకాశం లేదని నిర్ధారించిన హౌసింగ్ పీడీ రాజారత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 26న త్రీ టౌన్ పోలీసులు ఏఈపై క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఏఈ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినప్పటికీ ఏఈ సుబ్రమణ్యం పోలీసుల విచారణకు అస్సలు సహకరించడం లేదని సమాచారం. ఇనుమును ఎక్కడకి తరలించారు, ఎవరికి విక్రయించారు అనే ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో పోలీసులకు ఈ విచారణ సవాల్గా మారింది. దీంతో పూర్తి నిజాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
పెద్దల గుండెల్లో రైళ్లు..
బయటపడనున్న అసలు సూత్రధారులు
కొన్ని రోజుల క్రితం ఏఈ సుబ్రమణ్యం ఒక వీడియో విడుదల చేస్తూ, ఈ ఐరన్ చోరీ వెనుక కొంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రస్తుత పోలీసు విచారణలో కూడా కొందరు హౌసింగ్ అధికారులతో పాటు బయటి వ్యక్తుల పేర్లను ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితులను కూడా పోలీసులు ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు. వీరంతా నోరు విప్పితే హౌసింగ్ శాఖలోని పెద్ద తిమింగలాల పాత్రతో పాటు ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.
రూ.1.70 కోట్ల ఐరన్ చోరీ కేసు
రూరల్ హౌసింగ్ గోడౌన్లో
268 టన్నుల ఇనుము మాయం
కడప సెంట్రల్ జైలుకు తరలింపు
నోరు విప్పని నిందితుడు
పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు
త్రీటౌన్ పోలీసుల కసరత్తు
కీలక అధికారుల పాత్రపై ఏఈ ఆరోపణలు
త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం


