భార్గవరెడ్డి కుటుంబ సభ్యులకు జగన్‌ పరామర్శ | - | Sakshi
Sakshi News home page

భార్గవరెడ్డి కుటుంబ సభ్యులకు జగన్‌ పరామర్శ

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

భార్గవరెడ్డి కుటుంబ సభ్యులకు జగన్‌ పరామర్శ

ఎర్రగుంట్ల : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ ద్వారా వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి కుటుంభ సభ్యులను శనివారం పరామర్శించారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని శనివారం విశ్వభార్గవరెడ్డి కుమారుడు యర్రంరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడద్దని చెప్పారు.

17 నుంచి ఏపీఎల్‌ మ్యాచ్‌లు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడపలోని వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియల్‌ లీగ్‌ ఐదవ సీజన్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ మెంబర్‌ భరత్‌రెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో ఏపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 9 మ్యాచ్‌లు కడపలో జరుగుతాయన్నారు. ఇందులో విజయవాడ సన్‌సైనర్స్‌, తుంగభద్ర వారియర్స్‌, క్యాపిటల్‌ అమరావతి రాయల్స్‌, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌, రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, కాకినాడ కింగ్స్‌, బీమవరం బుల్స్‌, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌ జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు రూ.7 కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ మ్యాచ్‌లకు రోజుకొక అతిథితో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందజేయడంతోపాటు టాస్‌ వేయడం జరుగుతుందన్నారు. మ్యాచ్‌లో సినీ ప్రముఖులైన గాయకులు సునీత, సింహా, గీతామాధురి, కృష్ణచైతన్య, సంగీత వాయిద్యకారులు శ్రీహరి పాల్గొని ప్రేక్షకులను అలరిస్తారన్నారు. ఈ మ్యాచ్‌లను తిలకించేందుకు ఎంట్రీ ఉచితమని వివరించారు. గ్యాలరీల్లో ప్రేక్షకులకు కావాల్సిన మంచినీటి సౌకర్యాన్ని కల్పించి స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మునికుమార్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డిప్రసాద్‌, స్టేడియం చైర్మన్‌ శ్రావణ్‌రాజ్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పృథ్వి, స్టేడియం కన్వీనర్‌ సంజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement