ఎర్రగుంట్ల : విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరాల కోసం ఈ నెల 15 నుంచి దశల వారీగా చేస్తున్నట్లు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీపీపీలో తన యూనియన్ కార్యాలయంలో ఆందోళనలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు.
నేడు కవితా పురస్కార సభ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వసంతపేటలోని శ్రీకోదండరామస్వామి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు పల్లా జాతీయ కవితా పురస్కారం–2026 సభ నిర్వహించనున్నట్లు యువ సాహితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది అనంతపురానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకులు ఉమ్మడిశెట్టి రాధేయ రాసిన పావుకోళ్లు కవితా సంపుటికి పురస్కారం దక్కిందని వివరించారు. సాహితీ మిత్రులు సభను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా రైతుకు పురస్కారం
కడప అగ్రికల్చర్: పెండ్లిమర్రి మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు పి.రాజశేఖర్కు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు లభించింది. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ స్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఉత్తమ అభ్యుదయ రైతు’ పురస్కారాన్ని అందజేశారు. గుంటూరులో జరిగిన ఈ ఘనమైన వేడుకల్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) సత్యనారాయణ చేతుల మీదుగా రైతు రాజశేఖర్ ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు రూ.25,000 నగదు బహుమతిని అందుకున్నారు. రైతు పి.రాజశేఖర్ సాధించిన ఈ విజయానికి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డాక్టర్ వి.శిల్పకళ, సిబ్బంది ఆయనను శనివారం ఘనంగా సత్కరించారు.
గిరిజన బిడ్డకు ఐఐటీలో సీటు
వేంపల్లె : బక్కన్న గారి పల్లె గ్రామానికి చెందిన బంజారా గిరిజన బిడ్డ ధార్మిక్ వెంకట్ నాయక్ చైన్నె ఐఐటీలో సీటు దక్కించుకున్నారు. శనివారం వేంపల్లె జెడ్పిటీసీ రవికుమార్ రెడ్డి ధార్మిక్ వెంకట నాయక్ను అభినందించారు. ఐఐటీలో ఆలిండియా 27వ ర్యాంకు సాధించి సీటు పొందడం సంతోషకరమైన విషయమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు రమేష్ నాయక్, తావు నాయక్ పాల్గొన్నారు.


