
29న ఉద్యాన సమ్మేళనం
కడప అగ్రికల్చర్: కడపలో ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యాన శాఖ వారు ‘జిల్లా ఉద్యాన సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి తెలిపారు. స్థానికంగా ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నగర పరిధి రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యాన రంగంలోని వివిధ రకాల భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందులో ఉద్యాన రైతులు, ఉద్యాన శాస్త్రవేత్తలు, విత్తన ఉత్పత్తిదారులు, ఎరువుల సరఫరా దారులు, విధాన నిర్ణేతలు, ఇతర సంబంధిత నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ముఖ్యంగా ఉద్యాన రంగంలో ఎదుర్కొంటున్న తాజా సవాళ్లు, అవకాశాలపై చర్చించడంతో పాటు ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి వినూత్న సాంకేతికతలు, ఉత్తమ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం కూడా లక్ష్యం అన్నారు. వివిధ రకాలైన సెషన్లు ఉంటాయని వీటిలో నిపుణులచే ప్రసంగాలు, చర్చా వేదికలతోపాటు విజయవంతమైన ఉద్యాన పద్ధతుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. తమ పరిజ్ఞానం, అనుభవాలను పంచుకోవడానికి, ఒకరికొకరు సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది ఒక ప్రత్యేక మైన అవకాశం అన్నారు. కావున కడప, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉద్యాన రైతులతోపాటు ఈ రంగంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.