కడప సిటీ : సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులని కలెక్టర్ విజయ రామరాజు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి డీఆర్వో గంగాధర్ గౌడ్ తో పాటు జిల్లా పర్యాటకాధికారి మల్లిఖార్జున హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయన రచించిన శివతాండవం రచనకు కేంద్ర సాహిత్య అవార్డు లభించిందన్నారు. ఆంగ్లంలో లీన్స్ ద విండ్, ది హీరో మొదలైన ప్రఖ్యాతి చెందిన గ్రంథాలను రచించారన్నారు. ఆయనకు పర్షియన్ భాషలో చక్కని ప్రావీణ్యం కలదన్నారు. అలాగే 14 భాషలు తెలిసిన బహుభాషా కోవిదులన్నారు. అంతకు ముందు వారు పుట్టపర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ నాగేశ్వర్ రావు, ఎన్ఐసి విజయకుమార్, సీపీఓ వెంకట్రావు, కలెక్టరేట్ ఏఓ విజయ కుమార్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి సుభాషిణి పాల్గొన్నారు.
మహాకవి ‘పుట్టపర్తి’: ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
కడప అర్బన్: తెలుగు పదాలతో ‘శివతాండవం’ ఆడించి, తెలుగు సాహితీ కారుల్లో అగ్రగణ్యుడుగా నిలిచిన మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కొనియాడారు. మంగళవారం పుట్టపర్తి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎస్పీ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణాకుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్.ఎస్.ఎస్.వి. కృష్ణారావు, ఏ.ఆర్. డీఎస్పీ బి. రమణయ్య, డీపీఓ ఏఓ జ్యోతి, ఆర్ఐలు వీరేష్, సోమశేఖర్నాయక్, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.