కోదాడ: కోదాడకు చెందిన అందె వసంత్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా ఆరుగురిని ఎంపిక చేయగా వారిలో వసంత్ ఉన్నారు. అయితే వసంత్ కుటుంబం గరిడేపల్లి మండలం బొత్తలపాలేనికి చెందిన వారు కాగా.. కోదాడలో స్థిరపడ్డారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
జూదరుల అరెస్ట్
రాజాపేట : పేకాట స్థావరంపై దాడిచేసి 11 మందిని అరెస్టుచేసి వారి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని మల్లన్నగుట్ట సమీపంలో ఆంజనేయస్వామి దేవాలయంవద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ లింగారెడ్డి, సిబ్బందితో కలిసి దాడిచేశారు. 11 మందిని అరెస్టు చేయగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.68,800 నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇల్లు దగ్ధం
హుజూర్నగర్ : విద్యుత్ షార్ట్సర్క్యూట్తో రేకుల ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన హుజూర్నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. హుజూర్నగర్లోని గోవిందపురంలో గల గంగిరెద్దుల కాలనీలో ఆవుదొడ్డి వెంకన్న ఇల్లుకు మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. ఇంట్లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, మంచాలు, దుస్తులు కాలిపోయాయి. దీంతో సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని
ఒకరికి గాయాలు
కనగల్: మండలంలోని లచ్చుగూడెం గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి గాయాలయ్యాయి. గుర్రంపోడు మండలం తుర్కోనిబావి గ్రామానికి చెందిన పెరిక అంజయ్య బస్సు కోసం లచ్చుగూడెం స్టేజీ వద్ద వేచి ఉన్నాడు. ఈక్రమంలో నల్లగొండకు వస్తున్న దేవరకొండ డిపోకు చెందిన బస్సు అంజయ్యను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం 108 అంబులెన్స్లో నల్లగొండకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


