
హడలెత్తిస్తున్న శునకాలు
గుంపులుగా సంచారం
చిన్నారులపై దాడి చేస్తున్నాయి
రాత్రి సమయంలో వెళ్లలేకపోతున్నాం
మధ్యలోనే ఆగిన ఏబీసీ
ఏడాదిలో 16,612 కుక్కకాటు కేసులు
భువనగిరిటౌన్ : జిల్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఎప్పుడు ఏ పక్కనుంచి దాడి చేస్తాయో తెలియడం లేదు. గుంపులుగా సంచరిస్తూ చిన్నారులు, రోడ్లపై ఒంటరిగా వెళ్లే వ్యక్తులు, మూగజీవాలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఈనెల 8వ తేదీ వేకువజామున భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విఘ్నేష్ అనే యువకుడు వాకింగ్ చేస్తుండగా శునకం అకస్మాత్తుగా వచ్చి అతనిపై దాడి చేసింది. గాయాలపాలైన విఘ్నేష్ను తోటి వాకర్స్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి ఘటనలు ఏదో ఒక చోట నిత్యకృత్యం అయ్యాయి.
16,612 మందికి కుక్క కాటు
వీధి కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య ఏటా వందల్లో ఉంటుంది. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు 16,624 మంది కుక్కల బారిన పడ్డారు. ఇది కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య మాత్రమే. ప్రైవేట్ ఆస్పత్రులు, హైదరాబాద్కు వెళ్లి చికిత్స పొందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
సర్వే ప్రకారం 30వేల శునకాలు
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలు గత ఏడాది సర్వే చేయగా 30 వేల శునకాలు ఉన్నట్లు తేలింది. వీటిలో కేవలం గ్రామ పంచాయతీల్లోనే 27,025 కుక్కలు ఉన్నాయి. అత్యధికంగా సంస్థాన్నారాయణపురంలో 400, ఆ తరువాత ఇదే మండలంలోని పుట్టపాకలో 300 వరకు శునకాలు ఉన్నట్లు గుర్తించారు. అతి తక్కువగా వలిగొండ మండలం నర్సిగూడెంలో 10లోపు ఉన్నట్లు సర్వే బృందాలు తేల్చాయి. ఇక మున్సిపాలిటీల విషయానికొస్తే భువనగిరిలో వెయ్యికి పైగా.. ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్పోచంపల్లి, మోత్కూరు పట్టణాల్లో సగటున 400 పైగా కుక్కలు ఉన్నాయని తేల్చారు.
రాత్రి, పగలు తేడా లేకుండా గుంపులుగుంపులుగా శునకాలు సంచరిస్తున్నాయి. వీధులు, రహదారులు, హోటళ్లు, ఫంక్షన్హాళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, మాంసం, చికెన్న్ దుకాణాలు.. ఇలా ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో స్వైర విహారం చేస్తున్నాయి.ముఖ్యంగా రాత్రి వేళ, వేకువజామున బయటకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నట్టుండి ఒక్కసారి మనుషులపైకి దాడి చేస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు.
ఫ వెలుగులోకి రానివి వందల్లో..
ఫ శునకాల నియంత్రణకు మొక్కుబడి చర్యలు
ఫ మధ్యలోనే నిలిచిన ‘యానిమల్ బర్త్ కంట్రోల్’ కార్యక్రమం
ఫ సర్వే బృందాలు గత సంవత్సరం గుర్తించిన శునకాలు 30 వేలకు పైనే..
ఫ బయటకు వెళ్లాలంటేనేబెంబేలెత్తుతున్న జనం
వీధి కుక్కల సంచారం విపరీ తంగా పెరిగింది. ప్రధానంగా చిన్నారులపై దాడిచేసి గాయ పరుస్తున్నాయి. రాత్రి సమ యంలో బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఉంది.
–కప్పల వసంత, మోత్కూరు
ఆలేరులో వీధి కుక్కల బెడత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాదాచారులతో పాటు వాహనదారులను వదలడం లేదు. రాత్రి సమయంలో వీధుల్లో వెళ్లలేకపోతున్నాం. కుక్కలతో పాటు కోతలు బెడత కూడా ఉంది. –పులగం భాస్కర్, ఆలేరు
కుక్కల దాడులను సీరియస్గా తీసుకున్న హైకోర్టు.. వాటి సంతతిని నియంత్రించాలని గతంలో ఆదేశించింది. ఈ మేరకు కుక్కల సంతతి నియంత్రణపై ప్రభుత్వం దష్టి సారించింది. ఇందుకోసం జిల్లా కేంద్రమైన భువనగిరి శివారులో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ఏర్పాటు చేసింది. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కుక్కల సంతతి నియంత్రణ బాధ్యతలను అప్పగించింది. ఒక్కో శునకానికి రూ.1600 చొప్పున చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సంతతి నియంత్రణ కోసం కొన్ని శునకాలకు చికిత్స చేశారు. కానీ, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో సదరు ఏజెన్సీ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో శునకాల సంతతి నియంత్రణ కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది.

హడలెత్తిస్తున్న శునకాలు

హడలెత్తిస్తున్న శునకాలు

హడలెత్తిస్తున్న శునకాలు