
మాకొద్దు జీపీఓ కొలువు!
సాక్షి, యాదాద్రి : గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి(జీపీఓ) పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. కానీ, ఈ పోస్టులకు పూర్వపు వీఆర్ఓలు, వీఆర్ఏలు ఆసక్తి చూపడం లేదు. జీపీఓ పోస్టుల భర్తీకి రెండు దఫాలు పరీక్ష నిర్వహించిన 172 మంది మాత్రమే హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 318 రెవెన్యూ గ్రామాలున్నాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారంతా విధుల్లో చేరితే ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాలను కేటాయించే అవకాశం ఉంది.
సర్వీస్ లెక్కించకపోవడమేనా..
2020లో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు కాగా.. వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గ్రామస్థాయిలో తిరిగి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ పాలన అధికారులను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. వీఆర్ఓ, వీఆర్ఏలను పరీక్ష ద్వారా గ్రామ పాలనాధికారులుగా నియమించేందుకు సంకల్పించింది. అయితే తమ పాత సర్వీస్ కోల్పోతామని పలువురు జీపీఓ పరీక్ష రాయడానికి ఆసక్తి చూపలేదు. తద్వారా పదోన్నతుల్లో వెనుకబడిపోతామన్న ఆందోళన వారిలో నెలకొంది. ఈ నేపధ్యంలో తిరిగి మాతృసంస్థలోకి రావడానికి సుముఖత చూపడం లేదు.
పరీక్షకు తక్కువ సంఖ్యలో హాజరు
జీపీఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రెండుసార్లు పరీక్ష నిర్వహించింది. తొలిసారి మే 25న నిర్వహించిన పరీక్షకు 151 మంది దరఖాస్తు చేసుకోగా 139 మంది పరీక్ష రాశారు. అందులో 127 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులోనూ నలుగురు జీపీఓ ఉద్యోగంలో చేరడానికి ఇష్టం లేదని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో వీఆర్ఓలు 58, వీఆర్ఏలు 65 మంది ఉన్నారు. ఇక రెండవ సారి జూలై 27వ తేదీన నిర్వహించిన పరీక్షకు 37 మందికి గాను 34 మంది హాజరయ్యారు. ముగ్గురు హాజరు కాలేదు. పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది.
ఫ మాతృసంస్థలోకి రావడానికి
పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏల అనాసక్తి
ఫ పరీక్షలకు 173 మందే హాజరు
ఫ జిల్లాలో 318 రెవెన్యూ విలేజ్లు
ఫ ఒక్కొక్కరికి రెండు, మూడు
గ్రామాలు కేటాయించే అవకాశం
రెండు,మూడు గ్రామాలు తప్పవా?
ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. జిల్లాలో 318 రెవెన్యూ గ్రామాలున్నాయి. పూర్వ వీఆర్ఓలు 181, వీఆర్ఏలు 526 మందికి 172 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఒక్కొక్కరికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
సర్వీస్ కోల్పోతామన్న భయం
సర్వీస్ కోల్పోతామన్న భయంతో చాలామంది జీపీఓ పోస్టులపై ఆసక్తి కనబరచడం లేదు. ఈ కారణంగానే పరీక్ష రాయలేదు. మరోసారి పరీక్ష నిర్వహించాలని రెవెన్యూ మంత్రిని కోరాం. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వాలి.
–గుర్రాల బాలకృష్ణ, పూర్వ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి