
నేడు ఎంజీయూకు విద్యాకమిషన్ బృందం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహా త్మాగాంధీ యూనివర్సిటీకి మంగళవారం విద్యాకమిషన్ బృందం రానుంది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీతో పాటు సభ్యులు ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్రావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, కె.జోష్ణ శివారెడ్డి ఎంజీయూను సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు సెమినార్ హాల్లో యూనివర్సిటీ అధ్యాపకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అప్పిలేటేడ్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలతో కమిషన్ బృందం సమావేశం కానున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి తెలిపారు. విద్యా అంశాలపై చర్చించనున్నారని వెల్లడించారు.
గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్స్లు
సాక్షి, యాదాద్రి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం గుజరాత్ నుంచి 1,260 బ్యాలెట్ బాక్సులను తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1,650 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేశారు. కాగా ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అందనంగా బ్యాలెట్ బాక్సులను తెప్పిస్తున్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
రాజాపేట: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు రాజాపేట మండలంలోని దూదివెంకటాపురం పాఠశాల విద్యార్థి త్యాగరాజు ప్రభుదాసు ఎంపికయ్యారు. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో త్యాగరాజు ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 60 మీటర్ల పరుగులో, లాంగ్జంప్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఆగస్టు 7న జనగామ జిల్లా ధర్మకంచ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో త్యాగరాజు పాల్గొంటున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలి పారు. విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.
31న స్పాట్ అడ్మిషన్లు
భువనగిరి: పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో ఈనెల 31న స్పాట్ ఆడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జగదీశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ప్రవేశాలు అడ్మిషన్ పొందడానికి పదో తరగతిలో 420 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ టీసీ, మార్కుల మెమో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, మూడు పాస్ ఫొటోలతో నేరుగా కళాశాలలో హాజరుకావాలని కోరారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఎంపిక జాబితా ప్రకటిస్తామన్నారు.
ఏటీసీని సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరిటౌన్ : ఆలేరులో ఐటీఐలో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పేర్కొన్నారు. ఏటీసీకి సంబంధించిన పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లా యువత సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఏటీసీ దోహదపడుతుందన్నారు. ఐటీఐ కన్వీనర్ హరికృష్ణ మాట్లాడుతూ.. 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నామని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్్డ్ టూల్స్, బేసిక్ డిజైనర్ మరియు వర్చువల్ వెరిఫైయర్ (మెకానికల్), అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు iti.tela ngana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9866 843920 నంబర్ను సంప్రదించాలన్నారు.
30న జాబ్మేళా
నల్లగొండ : నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 30న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఎస్ఎస్సీ నుంచి ఏదేని డిగ్రీ, డిప్లొమా(అగ్రికల్చర్, హార్టికల్చర్) ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు వారి ఒరిజినల్స్, బయోడేటాతో జాబ్మేళాకు హాజ రు కావాలని పేర్కొన్నారు. వివరాలకు 7893420435ను సంప్రదించాలన్నారు.