
ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రామగిరి(నల్లగొండ): ఉస్మానియా విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఫిలాసఫీ, సోషియాలజీ, ప్రభుత్వ పాలనాశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, సైకాలజీ, ఎంకాం, ఎమ్మెస్సీ గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతోపాటు ముప్పై కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, తొమ్మిది రకాల డిప్లొమా కోర్సులు, యోగాలో సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 15 సెప్టెంబర్ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు www.oucde.net వెబ్సైట్తోపాటు సెల్ 9398673736, 9866977741 నంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని కోరారు.
రూ.6 కోట్ల లాభాల్లో యాదగిరిగుట్ట సొసైటీ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పీఏసీఎస్ రూ.6 కోట్ల లాభాల్లో ఉందని చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన పీఏసీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.28 కోట్ల టర్నోవర్తో సొసైటీ ముందుకెళ్తుందని, రైతులకు రూ.28 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. అవసరమైన రైతులు తీసుకెళ్లాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, డైరెక్టర్లు ధీరావత్ రమేష్, గంధమల్ల రమాదేవి, బత్తిని రామకృష్ణ, మాజీ సర్పంచులు, సీఈవో ఆంజనేయులు, నాయకులు బీమగాని రాములు, కొండం అశోక్రెడ్డి, ఎరుకల హేమేందర్గౌడ్, బేజాడి కుమార్, రైతులు పేరబోయిన బంగారు, గజం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సుదర్శన నారసింహ హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనల్లో భాగంగా శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ప్రభాతవేళ ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేపట్టిన అనంతరం గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. ఆ తరువాత గజ వాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తరం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
10.31 కోట్ల మంది.. ఉచిత బస్సు ప్రయాణం
రామగిరి(నల్లగొండ): మహాలక్ష్మి పథకం కింద నల్లగొండ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 10,31,28,640 మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా ఆర్టీసీకి రూ.502 కోట్ల ఆదాయం సమకూరింది. దేవరకొండ డిపో పరిధిలో 1.96 కోట్ల మంది, నల్లగొండ పరిధిలో 1,53,52,391 మంది, మిర్యాలగూడ పరిధిలో 1,54,85,729 మంది, నార్కట్పల్లి డిపో పరిధిలో 36,25,576 మందితో నల్లగొండ జిల్లాలో మొత్తం 5,44,0 9149 మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు. అలాగే సూర్యాపేట డిపో పరిధిలో 2.10కోట్లమంది, కోదాడ డిపో పరిధిలో 1.25 కోట్లతో కలిపి సూర్యాపేట జిల్లా మొత్తంగా 3.35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. ఇక, యాదాగ్రి భువనగిరి జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట డిపో పరిధిలో 1,54,25,000 మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.

ఓయూ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు