బీసీలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

బీసీలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

ఏలూరు టౌన్‌ : టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలను రాజకీయంగా ఎదగకుండా అణచివేయాలనే కుట్రపూరిత చర్యల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జోన్‌ కో–ఆర్డినేటర్‌, ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్‌యాదవ్‌ను మద్యం కేసుల్లో ఇరికించారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ ఆధ్వర్యంలో ఏలూరు జ్యూట్‌మిల్లు బ్రిడ్జి జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద ఆదివారం పార్టీ నేతలు నిరసన కార్యక్రమం తలపెట్టారు. సునీల్‌ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విక్రయాలు జరిగాయనీ, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిందని గుర్తుచేశారు. 2014–19 మధ్యకాలంలో (టీడీపీ హయాం) రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు ఉండేవనీ, ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయించారని గుర్తుచేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే అక్రమాలు జరిగాయని ఆరోపించటం వారి అవగాహనలోపాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించారనీ, రాత్రీపగలూ ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు చేస్తున్నారనీ విమర్శించారు. మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, ఈ సొ మ్ములు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలని నెరుసు చిరంజీవి డిమాండ్‌ చేశారు.

ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే..

వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌ను మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమేననీ, రాజకీయంగా ఎదిగితే పోటీ వస్తారనే భయంతో అణచివేసే కుట్రలు చే స్తారని ఆరోపించారు. మద్యం రవాణాకు సంబంధించి కేవలం వాహనాలు సరఫరా చేసిన సునీల్‌ను అరెస్ట్‌ చేశారనీ, కానీ ఢిల్లీకి చెందిన సిగ్మా సొల్యూషన్స్‌ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కిలారపు బుజ్జి, మోదుగుండు సూర్యనారాయణ, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి మోరు రామరాజు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా మోహనరావు, గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కట్టా ఏసుబాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, నగర బీసీసెల్‌ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌, లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు, నాయకులు తుమ్మగుంట రంగా, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్‌, సాసుపల్లి యుగంధర్‌, గంటా సాయిప్రదీప్‌, పిట్టా ధనుంజయ్‌, కొల్లిపర భగవాన్‌, పచ్చిపులుసు సృజన్‌, అగ్గాల కృష్ణ, మేతర సురేష్‌, పిల్లంగోళ్ల సత్యదేవ్‌, కుమారి, బందెల కిరణ్‌రాజు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

కారుమూరి సునీల్‌ అక్రమ అరెస్ట్‌పై నిరసన

ఏలూరులో పూలే విగ్రహం వద్ద శాంతియుత ధర్నా

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement