తాడేపల్లిగూడెం: త్వరలో గూడెం రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హాల్టు కల్పించనున్నామని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. శనివారం ఆయన అమృత్ భారత్ నిధులతో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుతో కలిసి పరిశీలించారు. ఈ పనుల వల్ల గూడెం రైల్వే స్టేషన్కు మహర్దశ పడుతుందన్నారు. అమృత్ భారత్ పథకంలో గూడెం స్టేషన్కు రూ.46.22 కోట్లు, గతిశక్తి పథకం కింద ఇంటర్నల్ ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10.22 కోట్లు కేటాయించామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసు, పత్సమట్ల ధర్మరాజు తదితరులు ఉన్నారు.
భీమవరం: జిల్లా పరిధిలో ఈ నెల 21న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ నీట్ను అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 5 పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. తాడేపల్లిగూడెంలో పరీక్షా కేంద్రాల వద్ద అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ ఆధ్వర్యంలో, భీమవరం పరిధిలో డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో, నర్సాపురం పరిధిలో డీఎస్పీ ఎం.సుధాకరరావు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.


