భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పారామెడికల్, సహాయక సిబ్బంది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పి.సూర్యనారాయణ తెలిపారు. ల్యాబ్ టెక్నిషియన్, ఎలక్ట్రిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్మార్టం అసిస్టెంట్ పోస్టులకు కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డిస్ట్రిక్ట్ సెలెక్టన్ కమిటీ ద్వారా భర్తీ చేయుటకుగాను దరఖాస్తులు కోరుతున్నామన్నారు. జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి కార్యాలయం, కలెక్టర్ ఆఫీసు క్యాంపస్, భీమవరంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
కొయ్యలగూడెం: మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ నిండు ప్రాణాన్ని బలిగొంది. నరసన్నపాలెం వై జంక్షన్ బైనేరు కొత్తవంతెన మధ్య శనివారం మధ్యాహ్నం సంభవించిన ప్రమాదంలో అడప రమేష్ (45) ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై వి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం రామానుజపురం గ్రామానికి చెందిన రమేష్ బైక్ పై జంగారెడ్డిగూడెంకి వెళ్లి తిరిగి వస్తుండగా వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో రమేష్ తలకి, ఛాతికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


