భీమవరం: జిల్లాలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ)పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 పరీక్షా కేంద్రాల్లో 2,475 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. భీమవరం డీఎన్నార్ పీజీ అటానమస్ కళాశాల, డీఎన్నార్ యూజీ అటానమస్ కళాశాల, తాడేపల్లిగూడెం ఎంఎంఎం అకాడమిక్ కాంప్లెక్స్, నిట్ కళాశాల, తణుకు పీఎంశ్రీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జేఎస్ఎంఎల్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్ రెడ్డి, డీఆర్ఓ బి శివన్నారాయణ రెడ్డి, భీమవరం, తాడేపల్లిగూడెం ఆర్డీవోలు కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎం సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.


