దెందులూరు: కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయిందని, చింతమనేని ప్రభాకర్ న్యాయవాది ఇంటిపై దాడి చేస్తే అతనిపై, అతని అనుచరులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కొఠారు అబ్బయ్యచౌదరి, మామిళ్ళపల్లి జయప్రకాష్, కంభం విజయరాజు ప్రశ్నించారు. దౌర్జన్యం చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపై కేసులు పెట్టడం ఆశ్చర్యకరమన్నారు. బుధవారం ఏలూరులో న్యాయవాది శ్రీనివాస్ నివాసంలో ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను అబ్బయ్య చౌదరి, జేపి, విజయరాజు పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయిందన్నారు. జేసీబీ తీసుకొచ్చి ఇల్లు కూల్చడానికి ప్రయత్నించి.. బూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తే జిల్లా యంత్రాంగం ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. న్యాయవాది ఇంటిపై దౌర్జన్యం చేస్తే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందని పదేపదే చెబుతున్న హోం మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. పరామర్శించిన వారిలో వడ్డీల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్బాబు, జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకా లక్ష్మణరావు, యువజన భాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు, కట్ట ఏసుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్ చౌదరి, ఏఎంసీ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవి, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు అబ్బయ్యచౌదరి, జేపీ, విజయరాజు


