
రామాలయంలో బంగారు అభరణాల అపహరణ
భీమడోలు: కోరుకొల్లు పంచాయతీ శివారు రత్నాపురంలోని రామాలయంలో బంగారు వస్తువులను దొంగించిన వ్యక్తిని భీమడోలు పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కోరుకొల్లు పంచాయతీ పరిధిలోని రామాలయంలో ఈనెల 14న రాత్రి గుడి తలుపుల తాళాలు పగులకొట్టి సుమారు 17 గ్రాముల బంగారు వస్తువులను పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన కట్టా సుబ్బారావు చోరీ చేసాడు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వై.సుధాకర్కు వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 19న రాత్రి గుండుగొలను వద్ద కట్టా సుబ్బారావును పట్టుకున్నారు. అతని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసి భీమడోలు కోర్టులో హాజరుపర్చారు.
అన్యాయంగా ఇళ్లను తొలగిస్తున్నారు
భీమవరం: పాలకోడేరు మండలం ఎస్ఆర్ నగర్లో అన్యాయంగా పేదల ఇళ్లను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తొలగిస్తున్నారని, పేదలకు అండగా ఉన్న సీపీఎం నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో లంకపేటలో ధర్నా నిర్వహించారు. సీపీఎం పట్టణ నాయకుడు ఎం.వైకుంఠరావు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ఉంటున్న పేదల ఇళ్లను నోటీసు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా తొలగించారని, 130 కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. ఉండి ఎమ్మెల్యే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా.. పేదల ఇళ్లను పీకి పడేస్తున్నారని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఎం నాయకులు మల్లిపూడి ఆంజనేయులు, ఇంజేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రామాలయంలో బంగారు అభరణాల అపహరణ