● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ముందు తెలుసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ చేపడితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడుతుందని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే అని డివిజన్ బెంచ్ చెప్పిన మాట బీఆర్ఎస్ నాయకులకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. నివేదికలోని టెక్నికల్ ఎర్రర్స్ను మాత్రమే హైకోర్టు తప్పు పట్టిందన్నారు. అంతే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు అని చెప్పలేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అని బీఆర్ఎస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే రైతులకు అత్యధిక బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని మరిచి పోయారా అని ఎమ్మెల్యే నిలదీశారు.


