విద్యార్థుల ప్రాథమిక సామర్థ్యాలపై సర్వే
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 2వ తరగతి విద్యార్థుల ప్రాథమిక చదువు – లెక్కల (ఎఫ్ఎల్ఎన్) సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎస్సీఈఆర్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు తెలిపారు. ఈ సర్వే నిర్వహణలో భాగంగా డీఈడీ, బీఈఎడ్ విద్యార్థులకు రంగశాయిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 53 ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. కేటాయించిన పాఠశాలలకు 25, 26, 27వ తేదీల్లో ఉదయం వెళ్లి 2వ తరగతి తెలుగు, ఉర్దూ, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్లకు సంబంధించిన టాస్క్షీట్ల ద్వారా విద్యార్థుల రెస్పాన్స్ను టాంగరిన్ యాప్లో అప్లోడ్ చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ సుజన్తేజ, డీఆర్పీలు శ్రీధర్గౌడ్, సుజాత, సెంటర్ ఇన్చార్జ్ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


