ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇసుకను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల ఇసుక రీచ్ల నుంచి సరఫరా చేసేందుకు టీజీఎండీసీ కేటాయించిందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన సాండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశం కలెక్టరేట్లో సోమవారం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా అంశంపై అధికారులతో ఆమె చర్చించారు. ఇసుక అవసరాల వివరాలతో భూపాలపల్లి కలెక్టర్కు లేఖ రాయాలని పీడీ హౌసింగ్ అధికారిని ఆమె ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక పరిమాణాన్ని ఇంజనీరింగ్ విభాగాల వారీగా తెలియజేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, ఇన్చార్జ్ పీడీ, హౌసింగ్ అధికారి శ్రీవాణి, మైనింగ్ ఏడీ రవికుమార్, తహసీల్దార్లు విజయ్సాగర్, శ్రీనివాస్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
యూరియాపై కలెక్టర్ సమీక్ష
ఖిలా వరంగల్: కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కలిసి యూరియాపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్ 2025 –26లో జిల్లావ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 1,12,345 ఎకరాల్లో సాగువుతున్నాయని తెలిపారు. గత యాసంగి 2024, డిసెంబర్ 28 వరకు 12,543 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగా, ఈసారి 2025, డిసెంబర్ 28వ తేదీ వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం జిల్లాలో డీలర్ల షాపుల్లో 434 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం 1,65,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదనపు యూరియా కౌంటర్లు ఏర్పాటుచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేసేలా చూడాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఏఈఓ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.


