
ప్రజలకు నిజాయితీగా సేవలందించాలి..
వరంగల్ క్రైం: ప్రజలకు నిజాయితీగా సేవలందించడం ద్వారా పోలీసుల పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన తోట వీరస్వామి, పోచయ్య, ఎం.రమేశ్, ఎం.సుధాకర్, పి.రమేశ్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈసందర్భంగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను సీపీ అలంకరించి అభినందించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా, నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని సూచించారు.
భద్రకాళి బోనాలు వాయిదా
ప్రకటించిన మంత్రి కొండా సురేఖ
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఈనెల 22న ప్రతిష్టాత్మకంగా బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల భద్రకాళి బోనాలకు సంబంధించి కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, అమ్మవారికి మాంసాహార బోనాలు సమర్పించనున్నారని పలు మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా ఈకార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలనుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు సృష్టిస్తారమోనని, కార్యక్రమంలో అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారనే అనుమానంతో బోనాల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం, వేదపండితుల సలహా మేరకు ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. కాగా.. ఈవిషయమై దేవాలయ ఈఓ శేషుభారతిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. మంత్రి ఆదేశం మేరకు బోనాల ఏర్పాట్లు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఆర్ట్స్ కాలేజీ వార్షిక
నివేదిక విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి సంబంధించి 2024–2025 వార్షిక నివేదికను కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, పీఆర్ఓ వి.హరికుమార్, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు.. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 21న (శనివారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. శనివారం ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలందించాలని కోరారు.
రుద్రేశ్వరుడిని దర్శించుకున్న
పద్మశ్రీ సోమలాల్ నాయక్
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయాన్ని శుక్రవారం పద్మశ్రీ సోమలాల్ నాయక్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కాగా.. శనివారం దేవాలయంలో జిల్లా యంత్రాంగం నిర్వహించే యోగా వేడుకలకు సోమలాల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ప్రజలకు నిజాయితీగా సేవలందించాలి..

ప్రజలకు నిజాయితీగా సేవలందించాలి..