
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
న్యూశాయంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి అధికారులు సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని, కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తమదని వరంగల్ జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, కోచైర్పర్సన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో ఎంపీ పోరిక బలరాంనాయక్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ కేంద్రం నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలో ఆస్పత్రుల పనితీరును మెరుగుపరచాలని సూచించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గాల వారీగా పరిష్కరించిన సమస్యలను అధికారులు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
దిశ చైర్మన్ పోరిక బలరాంనాయక్, కో–చైర్పర్సన్ కడియం కావ్య
వరంగల్ జిల్లా అభివృద్ధి
మానిటరింగ్ సమావేశం