
రసాయన ఎరువులు తగ్గించాలి
సంగెం: అవసరం మేరకే పంటలకు రసాయన ఎరువులు వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.ఉమారెడ్డి సూచించారు. వంజరపల్లి, కాపులకనిపర్తి గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ఆదా చేసి భావితరాలకు అందించాలన్నారు. పంటల మార్పిడి పాటించి సుస్థిర ఆదాయం పొందాలని, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. వరినారు మడుల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, అపరాలు, కూరగాయల సాగు గురించి వివరించారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, అశ్విని, శ్రావణ్, ఏఓ యాకయ్య, ఏఈఓలు రాజేందర్, లావణ్య, రైతులు పాల్గొన్నారు.