వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన భారీ బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలు పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లవైపు ఆశలు ఉన్నట్లు కనిపిస్తోంది. సొంత ఆదాయం రూ.32 శాతం కాగా, ప్రభుత్వాల గ్రాంట్లే 68 శాతంగా అంచనా వేశారు. గురువారం ఉద యం కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. రూ.1,071.48 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సభ ముందు ఉంచారు. బల్దియా జేఏఓ సరిత పద్దులను చదివి వినిపించారు. బడ్జెట్పై మాట్లాడేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, చాడ స్వాతి సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని, భవన నిర్మాణాల ఆక్రమణలు, కమర్షియల్ కనెక్షన్ల క్రమబద్ధీకరణ, నాన్ లేఅవుట్ల క్రమబద్ధీరణ చేయాలని కోరారు. ఆ తర్వాత బల్దియా బడ్జెట్ను ‘మమ’అనిపించారు. 30వ డివిజన్లో సీసీరోడ్లు నిర్మించిన వారానికే పగుళ్లు పట్టాయని బీజేపీ కార్పొరేటర్లు కొద్దిసేపు ప్లకార్డులు ప్రదర్శించారు. మాజీ కార్పొరేటర్ ఏకుల కోర్నేలు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1.20 గంటలపాటు బడ్జెట్ సమావేశం సాగింది.
బడ్జెట్ స్వరూపం ఇలా..
చివరి బడ్జెట్లో పద్దులను స్వల్ప మార్పులు తప్ప మక్కిమక్కిగా రూపొందించారు. రూ.1,071.8 కోట్లతో రూపొందించిన పద్దులు వివరాల ఇలా ఉన్నాయి. సొంత ఆదాయం రూ.337.38 కోట్లు(32 శాతం) కాగా, అందులో రెవెన్యూ వ్యయాలు రూ.197.96 కోట్లుగా కేటాయింపులు చేశారు. ప్రభుత్వ గ్రాంట్స్ రూ.728 కోట్లు (68 శాతం)గా అంచనా వేశారు. అందులో కేంద్రంనుంచి రూ. 55.28 కోట్లు (8శాతం), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 672.82 కోట్లు (92శాతం)గా నిర్ణయించారు. హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వైపు చూపు
2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,071.48కోట్లతో
గ్రేటర్ వరంగల్ బడ్జెట్
సొంత ఆదాయం రూ.337.38కోట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
నిధులు రూ.728.10కోట్లు
కేటాయింపులు చదివి వినిపించిన
జేఏఓ సరిత
మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదం