కొండా వర్గీయుడిపై ఇనుగాల వర్గీయుల దాడి | - | Sakshi
Sakshi News home page

కొండా వర్గీయుడిపై ఇనుగాల వర్గీయుల దాడి

Jun 1 2023 9:32 AM | Updated on Jun 1 2023 9:34 AM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ అబ్నూస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం జరిగిన డీసీసీ సమావేశంలో కొండా వర్గీయుడు గాడిపెల్లికి చెందిన సీనియర్‌ నాయకుడు కడిదెల కట్టస్వామిపై ఇనుగాల వర్గీయులు ధర్మారానికి చెందిన దుపాకి సంతోశ్‌తో సహా పలువురు దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలు సమన్వయం పాటించాలని వేదికపై ఉన్న నాయకులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.

సమావేశం నుంచి వెళ్తున్నప్పటికీ వెంటపడి దాడి చేయడంతో కట్టస్వామి షర్టు చినిగిపోయింది. అక్కడే ఉన్న వరదరాజేశ్వర్‌రావు అడ్డుకుని హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది. తెలిసిన సమాచారం మేరకు గత కొద్ది రోజులుగా ఇనుగాల వాట్సాప్‌ గ్రూప్‌లో కొండా అభిమాని కట్టస్వామి పోస్టింగ్‌లు పెట్టడంపై దుపాకి సంతోశ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశంలో కట్టస్వామి ఎదురుపడడంతో దుర్భాషలాడుతూ సంతోశ్‌ బృందం దాడికి పాల్పడినట్లు తెలిసింది.

సమావేశానికి తూర్పు నేతల గైర్హాజర్‌..
వరంగల్‌లోని అబ్నూస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం వరంగల్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో తూర్పు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గైర్హాజర్‌ అయ్యారు. డీసీసీ పదవీ రేసులో ఉన్న కొండా వర్గీయులకు పదవి దక్కక పోవడంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖలతో పాటు వారి వర్గీయులు సమావేశానికి దూరంగా ఉన్నారు.

తూర్పులో పార్టీ శ్రేణులు దాదాపు ఈసమావేశంలో కానరాకుండా పోయారు. ఎల్‌బీనగర్‌లో సమావేశం నిర్వహించినా మైనార్టీలు రాకపోవడం, కొండా వర్గీయులు కనిపించపోవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌ తూర్పు టిక్కెట్టు రేసులో ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నందునే కోపంతో కొండా దంపతులు హాజరు కాలేదని చర్చ సాగింది.

Advertisement
 
Advertisement
Advertisement