ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


