
నిర్వాసితుల అరిగోస
‘ఏదుల’ నిర్మాణంలో ముంపునకు గురైన రెండు గ్రామాలు
పరిహారం రాలేదు..
అధికారులు విచారణకు వచ్చిన సమయాల్లో నేను ఇంటివద్దే ఉన్నా. కానీ నేటికీ నాకు రావాల్సిన పరిహారం రూ.12.54 లక్షలు, ఇతర బెనిఫిట్స్ రాలేదు. నాలాగే డబ్బులు రానివారు ఏడెనిమిది మంది ఉన్నారు. సారోళ్లు ఇప్పటికై నా గుర్తించి డబ్బులు అందేలా చూడాలి.
– మిరిగిళ్ల శాంతమ్మ, కొంకలపల్లి
విద్యుత్ సమస్య పరిష్కరించాలి..
ఎస్సీకాలనీలో విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు పాతి అలాగే వదిలేశారు. రాత్రివేళల్లో చీకట్లో ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలం కావడంతో విషపు పురుగులు సంచరిస్తున్నాయి. విద్యుత్, మురుగు సమస్య వెంటనే పరిష్కరించాలి.
– మిద్దె మహేష్, బండరావిపాకుల (రేవల్లి)
ఉన్నతాధికారులకు నివేదించాం
కొత్త బండరావిపాకులలో ప్లాట్లు రానివారు బాధపడాల్సిన అవసరం లేదు. భూ సేకరణకు సంబంధించి గతంలో ప్రైమరీ నోటిఫికేషన్, పబ్లిక్ డిక్లరేషన్ ఉన్నతాధికారులకు పంపించాం. వారి ఆదేశాల మేరకు ముందుకుసాగుతాం. బండరావిపాకులలో మురుగు, విద్యుత్ సమస్య ఉన్నది వాస్తవమే. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.
– లక్ష్మీదేవి, తహసీల్దార్, రేవల్లి
గోపాల్పేట: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 2016లో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో మండలంలోని బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాలు ముంపునకు గురికాగా.. పునరావాసం క ల్పించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయా గ్రామస్తులకు అధికారులు నచ్చజెప్పి భూ సేకరణ చేపట్టారు. ప్రస్తుతం రిజర్వాయర్ నిర్మాణం కొనసాగుతుండగా.. నేటికీ ఇచ్చిన హామీ మేరకు పునరావాసం, నష్ట పరిహారం, ప్లాట్ల కే టాయింపు పూర్తిస్థాయిలో జరగలేదని ఆయా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. నాటి పాలకులు అన్నివిధాలా న్యాయం చేస్తామని చెప్పి గ్రామాలు ఖాళీ చేయించారని, వారి మాటలు నమ్మి మోసపోయామని.. ప్రస్తుత పాలకులైనా తమను ఆదుకోవాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
బండరావిపాకులలో మొత్తం 987 మందిని నిర్వాసితులుగా గుర్తించిన అధికారులు.. పునరావాసం కోసం శానాయిపల్లి సమీపంలో 52 ఎకరాల్లో 520 ప్లాట్లు కేటాయించారు. మరో 467 ప్లాట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇందుకోసం అదే గ్రామ సమీపంలో స్థలాలు పరిశీలించగా గ్రామస్తులు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. తమకు ఎక్కడ, ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారంటూ బాధితులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఖాళీ స్థలాలకు సంబంధించిన విచారణ కూడా పూర్తయినా నేటికీ డబ్బులు రాలేదు. అలాగే స్టాటిస్టికల్ ఎకనామికల్ సర్వే (ఎస్ఈఎస్) చేసినప్పుడు గ్రామంలోనే ఉండి డబ్బులు రానివారు సుమారు 20 మంది వరకు ఉన్నారని.. వారికి కూడా న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
● కొంకలపల్లి గ్రామస్తులకు 382 ప్లాట్లు ఇచ్చారు. ఈ గ్రామంలో సైతం ఎస్ఈఎస్ చేసినప్పుడు గ్రామంలోనే ఉండి నేటికీ డబ్బులు రాని వృద్ధులు ఏడుగురు ఉన్నారని వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు సైతం తక్కువ సంఖ్యలో కేటాయించారని.. ఇంటి నిర్మాణం చేపట్టలేని స్థితిలో చాలామంది ఉన్నారని, అర్హులందరికీ మంజూరు చేయాలని ముంపు బాధితులు అధికారులు, పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని నమ్మించి మోసం చేశారని నిర్వాసితులు బోరుమంటున్నారు.
అరకొరగా పరిహారం పంపిణీ
పునరావాస గ్రామంలో
సమస్యల వెల్లువ
వేధిస్తున్న విద్యుత్, మురుగు సమస్య
450 మందికి లభించని ప్లాట్లు

నిర్వాసితుల అరిగోస

నిర్వాసితుల అరిగోస

నిర్వాసితుల అరిగోస

నిర్వాసితుల అరిగోస