
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
వనపర్తిటౌన్: పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో 2025–26 విద్యాసంవత్సరం ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు గడుపు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు గడువు ఉందని.. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలలో చేరవచ్చని పేర్కొన్నారు.
యూరియా కృత్రిమ
కొరత సృష్టిస్తే చర్యలు
అమరచింత: యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఏడీఏ దామోదర్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా, ఎరువులు, పురుగు మందుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో అన్నిరకాల ఎరువులతో పాటు యూరియాను అందుబాటులో ఉంచుతుందన్నారు. కొందరు డీలర్లు అవసరం మేరకు యూరియా తెప్పించుకోలేకపోతున్నారని.. దీంతో రైతులు యూ రియా కోసం ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్న సమాచారం తమ దృష్టికి వచ్చిందని వివరించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని లేనిపక్షంలో లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ అరవింద్, ఇతర సిబ్బంది ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: హైదరాబాద్ రామంతాపూర్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని ఎస్సీ కుల బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2025–2026 విద్యా సంవత్సరంలో డే స్కాలర్ విధానంలో ప్రవేశానికి 01–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని, కుల, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని 8వ తేదీలోగా జిల్లాకేంద్రంలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో పనివేళల్లో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు జిల్లా క్రీడాకారులు
వనపర్తి రూరల్: పెబ్బేరు మత్స్య కళాశాల విద్యార్థులు గణేష్, శిరీష లాంగ్జంప్ సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల అసోసియేట్ డీన్ డా. దుర్గం సకారం తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి శాలువాలతో సన్మానించారు. ఓఎస్ఏ డా. భానుప్రకాష్, ిపీడీ దామోదర్ పాల్గొన్నారు.
కల్వరాల విద్యార్థిని..
వీపనగండ్ల: మండలంలోని కల్వరాల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మీనాక్షి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. జిల్లాస్థాయి రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్లో ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 3, 4 తేదీల్లో హన్మకొండలో జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో విద్యార్థిని పాల్గొంటుందన్నారు.
అదనపు కలెక్టర్కు
డిప్యూటేషన్
వనపర్తి: రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఫారెన్ సర్వీసు కింద హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి డిప్యూటేషన్పై వెళ్తున్నట్లు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్టీఓ సుబ్రమణ్యంకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయినట్లు పేర్కొన్నారు.

ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు