
ఆశాలకు వేతనం ఇవ్వాలి : సీఐటీయూ
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు కచ్చిత వేతనం కింద రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల 4వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి పనిభారాన్ని తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ జులై 9న జరిగే దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెలో ఆశా కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆశ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి సునీత సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు నిక్సన్, ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ, జిల్లా కోశాధికారి జె.భాగ్య, నాయకురాలు గిరిజ, దేవమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.