● పిడుగుపాటుకు క్రికెట్ ఆడుతున్న విద్యార్థి, ఓ మహిళ దుర్మరణం
● వారి కుటుంబాల్లో విషాదం
ఓ వైపు ఎల్నినో ప్రభావంతో ఉదయమంతా భగభగమండే ఎండలు... మరో వైపు సాయంత్రం పిడుగుల వాన మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. విభిన్నవాతావరణ పరిస్థితులు జిల్లా ప్రజల్లో దడపుట్టిస్తున్నాయి. జిల్లాలో శనివారం సాయంత్రం వేర్వేరు ప్రదేశాల్లో పిడుగుపాటుకు ఓ విద్యార్థి, పశువుల కాపరి ప్రాణాలు విడిచారు. భవిష్యత్తును బంగారం చేసుకునేందుకు ముందుకు సాగుతున్న విద్యార్థి... పశువులు మేపుతూ కుటుంబ భారాన్ని మోస్తున్న మహిళ మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
● ఆడుతూనే మృత్యు ఒడిలోకి..
రేగిడి: పాఠశాలలు, కళాశాలలకు రెండో శనివారం సెలవు కావడంతో రేగిడి మండలం కొండవలస గ్రామానికి చెందిన విద్యార్థులందరూ ఒక చోటకు చేరారు. సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. మేఘావృతమైనా ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పిడుగుల వాన ఆరంభమైంది. తలదాచుకునేందుకు పరుగు తీసే సమయంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల్లో ఆమిటి పవన్ (17)ను పిడుగుతాకింది. అంతే అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పవన్ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ సీఈసీ చదువుతున్నాడు. ఆదుకుంటాడనుకున్న కొడుకు అకాల మరణంతో ఆర్ఎంపీ అయిన తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి బోరున విలపిస్తున్నారు.


