● ఎంఎస్ఎంఈ పార్కుకు భూములివ్వం
● కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన రైతులు
బొండపల్లి: ఒక పక్క ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో పార్కును ఏర్పాటు చేసి అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న జిరాయితీ, డీపట్టా భూముల్లో మరో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి భూములు లాక్కునే ప్రయత్నం విరమించుకోవాలని రైతు సంఘం, సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తూ తహఽసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కొండకిండాంలో ఏడాది క్రితం ప్రారంభించిన పార్కుకే ఇంతవరకు దిక్కు లేదని ఇప్పడు కొండకిండాం, కిండాం అగ్రహారం, రాచకిండాం గ్రామాల పరిధిలో 175 ఎకరాలు పార్కు పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అరఎకరం,ఎకరం ఉన్న సన్న, చిన్న కారు రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూడు గ్రామాలకు చెందిన రైతులు వారం రోజులుగా అందోళనలు చేడుతున్నా,సంబంధింత మంత్రి, నియోజకవర్గం ఎమ్మేల్యే కనీసం బాధిత రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి సమీక్షా సమావేశం నిమిత్తం వచ్చిన కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావుకు కూడా వినతిపత్రం అందజేసి కార్యాలయం వద్దనే భోజనాలు చేసి సాయంత్రం వరకు నిరసన తెలియ చేసి తమకు న్యాయం చేయాలని అధికారులును కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తొత్తడి పైడిపు నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు, పోరాట కమిటీ నాయకులు, మూడు గ్రామాలకు చెందిన బాధిత రైతులు పాల్గొన్నారు.


