బొబ్బిలి రూరల్: ఉపాధినిస్తున్న డ్రైవర్ కొలువే ఓ డ్రైవర్ ఉసురు తీసింది. బాడంగి మండలం పినపెంకికి చెందిన బోనకల సింహాచలం(55) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బొబ్బిలి పట్టణానికి కుటుంబంతో వచ్చి ఇక్కడే పనిచేస్తున్నాడు. సింహాచలానికి సొంత వాహనం లేకపోవడంతో ఇతరుల వాహనాలకు డ్రైవర్ లభ్యత లేనిపక్షంలో వెళ్తుంటాడు.ఈ క్రమంలోనే బుధవారం మరొకరి వాహనానికి డ్రైవర్గా స్టోన్ క్రషర్ వద్ద లభించే బుగ్గి(క్రషర్ బుగ్గి) కోసం మండలంలోని భోజరాజపురం రోడ్డులో గల క్రషర్కు వెళ్లాడు. ఆ సమయంలో ట్రాక్టర్కు ఉండే వెనుక హైడ్రాలిక్ తొట్టె ఆకస్మాత్తుగా మీదకు లేచి ఉండిపోయింది. ఇది గమనించిన సింహాచలం ట్రాక్టర్ను నిలిపి లేచిన తొట్టెను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తొట్టె కిందికి వాలుతూ సింహాచలంపై పడిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం భార్య లక్ష్మి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. వారికి ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. రెండో కుమార్తె సంధ్యారాణి ఇంటివద్దనే సహాయకారిగా ఉంటోంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనపై సింహాచలం కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కాశి దర్యాప్తు చేస్తున్నారని సీఐ కె.నారాయణ రావు విలేకరులకు తెలిపారు.


