● కూలి డబ్బుల పంపకంలో వివాదం
● బావను హత్య చేసిన బావమరిది
● నిందితుడి అరెస్టు
చీపురుపల్లి రూరల్(గరివిడి):
గరివిడి మండలం శివరాం గ్రామంలో కూలి డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. సొంత బావనే బావమరిది హత్య చేశాడు. సంచలనం సృష్టించిన దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, ఎస్ఐ బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాలు.. శివరాంలోని ఎస్సీ కాలనీకి చెందిన మజ్జి శ్రీను అతని బావ, చెల్లి పచ్చిపాల కనకరాజు, సుజాత విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం సమీపంలోని ఇసుకపాలెంలో కూలి పనుల కోసం వెళ్లి కొద్ది నెలలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. పనులు పూర్తయిన తరువాత ఇటీవల వారు స్వగ్రామమైన శివరాం చేరుకున్నారు. ఈ నెల 8న కూలి డబ్బుల పంపకంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. బావ కనకరాజు రోజుకు రూ.110 చొప్పున కూలి ఇవ్వగా.. రూ.130లు చొప్పున చెప్పి పనులకు తీసుకువెళ్లి తక్కువ ఎలా ఇస్తావని బావమరిది శ్రీను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన శ్రీను సమీపంలో ఉన్న చెక్క పలకతో కనకరాజు తలపై బలంగా కొట్టాడు. దీంతో బావ కనకరాజు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనును హత్యానేరం కింద అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.


